
GST Council meet today:నేడు54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం..బీమా ప్రీమియం పన్ను, రేట్ల హేతుబద్ధీకరణ..కీలక అంశాలపై నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
నేడు ఢిల్లీలో 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీమా ప్రీమియం, ఆన్లైన్ గేమింగ్ వంటి పన్నులపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపునకు సంబంధించి, ఈ ప్రభావంపై ఫిట్మెంట్ కమిటీ తన నివేదికను సమర్పించనుందని సమాచారం.
ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర పన్నుల అధికారులు ఉంటారు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా చర్చల్లో పాల్గొంటారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరవుతున్నారు.
వివరాలు
తగ్గించాలా వద్దా
జీఎస్టీ కౌన్సిల్ ఆరోగ్య బీమాపై ప్రస్తుత 18 శాతం పన్ను తగ్గించాలా లేదా సీనియర్ సిటిజన్లకు మినహాయింపు ఇవ్వాలా అనే విషయంపై చర్చ జరుగుతుంది.
అలాగే, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపునకు సంబంధించిన అంశం కూడా చర్చకు వస్తుంది.
ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తగా, సీతారామన్కు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా బీమాపై జీఎస్టీ తొలగింపుకు సంబంధించిన లేఖ రాశారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల జీఎస్టీ కౌన్సిల్లో చర్చ సందర్భంగా 75 శాతం జీఎస్టీ ఆదాయం రాష్ట్రాలకు వెళ్తుందని స్పష్టం చేశారు.
వివరాలు
మార్పు చేస్తారా
పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య కూడా రేట్ల హేతుబద్ధీకరణ అంశాన్ని లేవనెత్తగా, ఈ అంశాన్ని ఫిట్మెంట్ కమిటీకి సిఫార్సు చేశారు.
మరోవైపు, ఆన్లైన్ గేమింగ్ విషయంలో కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులు జీఎస్టీ కౌన్సిల్కు స్టేటస్ రిపోర్టును సమర్పిస్తారు.
అక్టోబర్ 1, 2023 నుండి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫార్మ్లు, క్యాసినోలపై 28 శాతం జీఎస్టీ విధింపును అమలు చేశారు, అయితే గతంలో ఈ కంపెనీలు ఈ స్థాయి జీఎస్టీ చెల్లించడం లేదు.