
India's electronics exports: నాన్-స్మార్ట్ఫోన్ కేటగిరీలదే పెద్ద పాత్ర..39 బిలియన్ డాలర్లు దాటిన భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు గణనీయంగా పెరిగి 2024-25 ఆర్థిక సంవత్సరంలో $38.57 బిలియన్కి చేరాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 32.47 శాతం వృద్ధి. ఈ వృద్ధిలో స్మార్ట్ ఫోన్ల కంటే నాన్-స్మార్ట్ఫోన్ కేటగిరీలు కీలక పాత్ర పోషించాయి. ఎలక్ట్రానిక్స్ & కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎగుమతి ప్రోత్సాహక మండలి (ESC) నివేదిక ప్రకారం, నాన్-స్మార్ట్ఫోన్ కేటగిరీల ఎగుమతులు $14 బిలియన్ దాటాయి. దీంతో భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల వాటా మొత్తం సరుకు ఎగుమతుల్లో 6.73 శాతం నుంచి 9 శాతానికి పెరిగింది.
వివరాలు
నాన్-స్మార్ట్ఫోన్ కేటగిరీల వృద్ధే ప్రధాన కారణం
స్మార్ట్ఫోన్లు ఎగుమతుల్లో పెద్ద భాగం కొనసాగించినప్పటికీ, నిజమైన వృద్ధి నాన్-స్మార్ట్ఫోన్ కేటగిరీల నుంచే వచ్చింది. వీటిలో సోలార్ ప్యానెల్స్, టెలికాం పరికరాలు, మెడికల్ ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, డిజిటల్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఒక్కటే $1.12 బిలియన్ ఎగుమతులు సాధించాయి. టెలికాం పరికరాలు, వాటి విడి భాగాలు $1.4 బిలియన్కి చేరగా, రెక్టిఫైయర్స్, ఇన్వర్టర్లు, ఛార్జర్లు కలిపి $2.5 బిలియన్ ఎగుమతులు సాధించాయి.
వివరాలు
మెడికల్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ యూనిట్లు కూడా కీలకమే
మెడికల్ ఎలక్ట్రానిక్స్ కూడా $0.4 బిలియన్ ఎగుమతులు సాధించాయి. పర్సనల్ కంప్యూటర్స్, డిజిటల్ ప్రాసెసింగ్ యూనిట్లు మరో $0.81 బిలియన్ తోడయ్యాయి. ESC ఈ ఫలితాన్ని "భారత్ టెక్నాలజీ ప్రస్థానంలో కీలక మలుపు"గా పేర్కొంటూ, దేశ ఆర్థిక, వాణిజ్య లక్ష్యాలలో ఎలక్ట్రానిక్స్ ప్రాధాన్యం పెరుగుతోందని స్పష్టం చేసింది.
వివరాలు
ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో అగ్ర రాష్ట్రాలు
ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో తమిళనాడు $14.65 బిలియన్తో అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటక ($7.8 బిలియన్), ఉత్తరప్రదేశ్ ($5.26 బిలియన్), మహారాష్ట్ర ($3.5 బిలియన్), గుజరాత్ ($1.85 బిలియన్) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అదనంగా, భారత్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న సెమీకండక్టర్ రంగం కూడా ఈ వృద్ధికి దోహదపడిందని ESC పేర్కొంది. ప్రభుత్వం ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్లలో కలిపి ₹4,600 కోట్ల విలువైన కొత్త చిప్ తయారీ యూనిట్లను ఆమోదించింది.
వివరాలు
భారత ఎలక్ట్రానిక్స్ రంగంలో నిర్మాణాత్మక మార్పులు
దేశంలో ఎలక్ట్రానిక్ కంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్ (ECMS)ను ప్రారంభించారని ESC వెల్లడించింది. దీని ద్వారా దేశీయ సప్లై చైన్ను బలోపేతం చేయడం, దిగుమతి ఆధారాన్ని తగ్గించడం లక్ష్యమని తెలిపింది. ESC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ మాట్లాడుతూ, "ఇది తాత్కాలికం కాదు, ఇది నిర్మాణాత్మక మార్పు. ఈ వేగం కొనసాగితే భారత్ 2030 నాటికి $200 బిలియన్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతి లక్ష్యాన్ని చేరుకుంటుంది" అన్నారు.