LOADING...
Nvidia-china: చైనా చిప్ అమ్మకాల ఆదాయంలో 15% అమెరికాకు చెల్లించనున్న ఎన్విడియా, ఎఎమ్‌డి 
చైనా చిప్ అమ్మకాల ఆదాయంలో 15% అమెరికాకు చెల్లించనున్న ఎన్విడియా, ఎఎమ్‌డి

Nvidia-china: చైనా చిప్ అమ్మకాల ఆదాయంలో 15% అమెరికాకు చెల్లించనున్న ఎన్విడియా, ఎఎమ్‌డి 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా నుంచి చైనాకు అత్యాధునిక కంప్యూటర్‌ చిప్‌ల ఎగుమతిపై నెలలుగా కొనసాగుతున్న నిర్బంధానికి ఇప్పుడు మార్గం సుగమమైంది. చైనాలో జరిగే తమ విక్రయాల ద్వారా వచ్చే లాభాల్లో ఒక భాగాన్ని అమెరికా ట్రంప్‌ ప్రభుత్వానికి చెల్లించేందుకు అమెరికన్‌ చిప్‌ దిగ్గజాలు ఎన్విడియా,ఏఎండీ అంగీకరించాయి. ఈ నిర్ణయం వల్ల చిప్‌ ఎగుమతులు తిరిగి ప్రారంభం కానున్నాయి. భద్రతా కారణాల్ని చూపుతూ గతంలో అమెరికా ఈ ఎగుమతులను నిలిపివేయగా, ప్రతిస్పందనగా చైనా అరుదైన ఖనిజాల ఎగుమతిపై పరిమితులు విధించింది. ఇప్పుడు లాభాల్లో భాగస్వామ్యం రూపంలో అంగీకారం కుదిరినందున, అమెరికా ప్రభుత్వం ఎగుమతులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

వివరాలు 

ఆంక్షల నుంచి మినహాయింపు దిశగా 

జో బైడెన్‌ పాలనలో చైనాకు అత్యాధునిక చిప్‌ల విక్రయంపై అమెరికా కఠిన ఆంక్షలు అమలు చేసింది. దానికి ప్రతిగా, చైనా మార్కెట్‌ కోసం ఎన్విడియా ప్రత్యేకంగా హెచ్‌20 చిప్‌లను రూపొందించింది. కానీ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ హెచ్‌20 చిప్‌లపైనా నిషేధం విధించడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీని ఫలితంగా ఎన్విడియాకు భారీ ఆదాయనష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో, ఎన్విడియా సీఈఓ జెన్సెన్‌ హువాంగ్ వాషింగ్టన్‌, బీజింగ్‌ల మధ్య చురుకైన లాబీయింగ్‌ ప్రారంభించారు. గత వారం ట్రంప్‌తో సమావేశమైన అనంతరం, చైనాకు చిప్‌ ఎగుమతులపై కీలక ప్రకటన వెలువడింది.

వివరాలు 

లాభాల్లో 15% అమెరికాకు 

కొత్త ఒప్పందం ప్రకారం, చైనాలో ఎన్విడియా విక్రయించే హెచ్‌20 ఏఐ చిప్స్,ఏఎండీ విక్రయించే ఎంఐ 308 చిప్స్ ద్వారా వచ్చే లాభాల్లో 15 శాతం అమెరికా ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే ఈ విధానం కేవలం అమెరికా ప్రభుత్వం ఎగుమతి లైసెన్స్‌ ఇచ్చిన ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే, రెండు కంపెనీలు తమ సేల్స్‌ రికార్డులను సురక్షితంగా భద్రపరచి, అవసరమైనప్పుడు అమెరికా అధికారులతో పంచుకోవాలి. అమెరికా ఈ మొత్తాన్ని చిప్‌ పరిశోధన మరియు టెక్నాలజీ భద్రతా చర్యల కోసం వినియోగించనుంది.

వివరాలు 

భద్రతా భయాలు - ఆర్థిక ఒత్తిడి 

చైనా సైనిక అవసరాల కోసం అత్యాధునిక చిప్‌లను వినియోగిస్తుందనే అనుమానాలే అమెరికా ఆంక్షలకు ప్రధాన కారణం. అయితే, ఈ ఆంక్షలు అమెరికా చిప్‌ కంపెనీల ఆదాయాన్ని దెబ్బతీశాయి. దీంతో చైనాలోని పోటీదారులకు అవకాశాలు పెరిగిపోతాయని గ్రహించిన అమెరికా, కొంతమేర సడలింపులు ఇచ్చింది. ఇదే సమయంలో, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న టారిఫ్‌ యుద్ధానికి 90 రోజుల విరామం లభించింది. దీనికి అనుగుణంగా చైనా అరుదైన ఖనిజాల ఎగుమతిపై విధించిన పరిమితులను సడలించగా, అమెరికా ట్రంప్‌ ప్రభుత్వం చిప్‌ ఎగుమతులకు పచ్చజెండా ఊపింది.