Page Loader
UPI: ఏప్రిల్ 1 నుండి, ఈ వినియోగదారులకు UPI పనిచేయదు

UPI: ఏప్రిల్ 1 నుండి, ఈ వినియోగదారులకు UPI పనిచేయదు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2025
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. స్మార్ట్‌ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చిన్న మొత్తాల నుండి పెద్ద మొత్తాల వరకు యూపీఐ (UPI) ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటియం వంటి యాప్‌ల సహాయంతో డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ఇటీవల, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానున్నాయి. బ్యాంకులు డిస్‌కనెక్ట్ చేసిన లేదా సరెండర్ చేసిన మొబైల్ నంబర్లను మార్చి 31లోగా తొలగించాలని యాప్‌లను ఆదేశించింది.

వివరాలు 

మొబైల్ నంబర్లు మారినప్పుడు సమస్యలు ఏర్పడే అవకాశం

సాధారణంగా, ఒక మొబైల్ నంబర్‌ను వరుసగా 90 రోజులు వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ లేదా కనీసం డేటా కోసం ఉపయోగించకపోతే, మొబైల్ కంపెనీలు ఆ నంబర్‌ను డీయాక్టివేట్ చేస్తాయి. ఈ డీయాక్టివేట్ అయిన నంబర్లను ఇతర వినియోగదారులకు కేటాయిస్తారు. ఈ కారణంగా, బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన మొబైల్ నంబర్లు మారినప్పుడు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, ఏప్రిల్ 1 నుండి బ్యాంకులు ప్రతి వారం డీయాక్టివేట్ అయినా, సరెండర్ చేసిన నంబర్లను తొలగిస్తూ, తమ డేటాబేస్‌ను రెగ్యులర్‌గా అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని NPCI స్పష్టం చేసింది.

వివరాలు 

స్టీరింగ్ కమిటీ సమావేశం ఆధారంగా మార్గదర్శకాలు 

గతేడాది జూలై 16న నిర్వహించిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా ఈ మార్గదర్శకాలను రూపొందించారు. బ్యాంకులు మొబైల్ నంబర్లను అప్‌డేట్ చేసుకునేందుకు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. మార్చి 31 నాటికి బ్యాంకులతో పాటు యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈ మార్గదర్శకాలను పాటించాల్సిందేనని NPCI స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుండి బ్యాంకులు వివరణాత్మక నివేదికలను పంచుకోవాల్సిన అవసరం ఉంది.

వివరాలు 

యాక్టివ్‌లో లేని నంబర్లకు యూపీఐల డీయాక్టివేట్

అలాగే, అప్‌డేట్ చేసిన మొబైల్ నంబర్ల ద్వారా నిర్వహించిన లావాదేవీల సంఖ్యను కూడా పేర్కొనాల్సిన అవసరం ఉంటుంది. NPCI తీసుకున్న ఈ చర్యల వల్ల సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. యూపీఐ సేవలను వినియోగించడానికి మొబైల్ నంబర్ తప్పనిసరి. గతంలో యూపీఐకి లింక్ చేసిన నంబర్లను ఉపయోగించి చాలామంది లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అయితే, ఏప్రిల్ 1 నుండి అలాంటి లావాదేవీలు సాధ్యంకాదు. యాక్టివ్‌లో ఉన్న మొబైల్ నంబర్లను మాత్రమే బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. యాక్టివ్‌లో లేని నంబర్లకు సంబంధించిన యూపీఐలను డీయాక్టివేట్ చేయనున్నారు. మీరు యూపీఐ సేవలను నిరంతరం ఉపయోగించాలనుకుంటే, సంబంధిత మొబైల్ నంబర్లను రెగ్యులర్‌గా రీచార్జ్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే భవిష్యత్తులో లావాదేవీల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.