
Rapido food delivery: ఫుడ్ డెలివరీ విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న ర్యాపిడో.. షేక్ అవుతున్న స్విగ్గీ, జొమాటో షేర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఫుడ్ డెలివరీ రంగంలో ప్రస్తుతం స్విగ్గీ, జొమాటోలకు ఆధిపత్యం ఉంది.
గతంలో ఈ విభాగంలో అనేక సంస్థలు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు ముందుకొచ్చినా, వివిధ కారణాల వల్ల అవి నిలదొక్కుకోలేక పోయాయి.
ఇప్పుడు క్యాబ్ సేవలు అందిస్తున్న ర్యాపిడో ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
ఈ సంస్థ తీసుకొస్తున్న ఫిక్స్డ్ కమీషన్ విధానం స్విగ్గీ, జొమాటోలను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఇవి చెందిన షేర్లపై నేడు ఒత్తిడి నెలకొంది.
ప్రస్తుతం ఓలా, ఉబర్ తరహాలో ర్యాపిడో క్యాబ్ సేవలను అందిస్తోంది.
తాజాగా ఫుడ్ డెలివరీ విభాగంలోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ రెస్టారెంట్లతో ఒప్పందాలు చేసుకుంటోంది.
వివరాలు
ర్యాపిడో కమీషన్ శాతం సుమారు 8 నుండి 15 శాతం మధ్యలో..
ఈ ఒప్పందాల ప్రకారం,రూ.400 వరకు ఉన్న ఆర్డర్లపై రూ.25, రూ.400కిపైగా ఉన్న ఆర్డర్లపై రూ.50 చొప్పున రెస్టారెంట్ల నుంచి కమీషన్ వసూలు చేయనుంది.
అంటే, మొత్తం లెక్కించుకుంటే ర్యాపిడో కమీషన్ శాతం సుమారు 8 నుండి 15 శాతం మధ్యలో ఉండనుంది.
ఇది ప్రస్తుతం స్విగ్గీ, జొమాటోలు తీసుకుంటున్న 16 నుండి 30 శాతం కమీషన్తో పోలిస్తే చాలా తక్కువగా ఉండటం విశేషం.
ర్యాపిడో తన సేవలను జులై నెలలో బెంగళూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
నష్టాలతో ముగిసిన స్విగ్గీ, జొమాటో మాతృసంస్థల షేర్లు
అలాగే, ప్రస్తుతం ర్యాపిడో యాప్లోనే రెస్టారెంట్ల జాబితా కూడా చూపించే విధంగా మార్పులు చేపట్టనున్నట్టు సమాచారం.
"అదే సమయంలో, ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గీ, జొమాటోల ఆధిక్యతను ర్యాపిడో తీసుకురానున్న ఫిక్స్డ్ కమీషన్ విధానం సవాల్ చేయగలదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో మార్కెట్ మొత్తం సానుకూలంగా ఉన్నా,స్విగ్గీ, జొమాటో మాతృసంస్థల షేర్లు మాత్రం నష్టాలతో ముగిశాయి. జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ షేరు విలువ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో (NSE) సుమారు 2 శాతం తగ్గి రూ.256 వద్ద ముగిసింది. స్విగ్గీ షేరు విలువ కూడా 2.63 శాతం నష్టంతో రూ.364.90 వద్ద స్థిరపడింది.