
Coolie: 'కూలీ' హిందీ రిలీజ్లో ఆమిర్ ఖాన్ ప్రమేయం లేదు: క్లారిటీ ఇచ్చిన టీమ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం 'కూలీ' (Coolie) ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ హీరోగా, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ఇప్పటికే విపరీతమైన అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే, ముఖ్యంగా హిందీ వెర్షన్ విడుదల విషయంలో ఆమిర్ స్వయంగా ముందడుగు వేస్తున్నాడని ఇటీవల మీడియాలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఈ విషయంపై చిత్ర బృందం స్పందించింది.
వివరాలు
పుకార్లపై ఆమిర్ టీమ్ స్పష్టమైన వివరణ
ఉత్తర భారత మార్కెట్లో ఎక్కువ మల్టీప్లెక్స్ థియేటర్లు ఇప్పటికే 'వార్ 2' (War 2)కోసం బుక్ అయినందున,'కూలీ' విడుదల కోసం ఆమిర్ ఖాన్ ఐనాక్స్,పీవీఆర్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థల అధికారులతో చర్చలు జరుపుతున్నాడని కొన్ని రిపోర్టులు వచ్చాయి. అంతేకాకుండా,ఈసినిమా డిస్ట్రిబ్యూషన్లోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ పుకార్లపై ఆమిర్ టీమ్ స్పష్టమైన వివరణ ఇచ్చింది."ఈ కథనాలన్నీ పూర్తిగా అసత్యం.ఆమిర్ గానీ, ఆయన బృందంలో ఎవ్వరూ 'కూలీ' పంపిణీకి సంబంధించిన ఎలాంటి వ్యవహారాల్లో పాల్గొనలేదు. ఎవరికీ ఈ విషయమై ఫోన్ చేయలేదు. ఆయన ఈ సినిమాలో కేవలం అతిథి పాత్ర మాత్రమే పోషించారు.లోకేశ్ కనగరాజ్,రజనీకాంత్లతో ఉన్న స్నేహం,అనుబంధం కారణంగా ఆ పాత్రకు అంగీకరించారు.షూటింగ్ పూర్తయింది"అని పేర్కొంది.
వివరాలు
ప్రత్యేక గీతంలో పూజా హెగ్డే
అదే సమయంలో,ఇటీవల యూట్యూబ్లో విడుదలైన ఆమిర్ నటించిన 'సితారే జమీన్ పర్' చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్నట్టు కూడా ఆమిర్ బృందం తెలిపింది. "ప్రేక్షకులు చూపిస్తున్న అభినందనలకు హృదయపూర్వక ధన్యవాదాలు" అని కృతజ్ఞతలు తెలిపింది. 'కూలీ' విషయానికి వస్తే .. ఇది భారీ బడ్జెట్తో,అగ్రతారాగణంతో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో ప్రత్యేక గీతంలో పూజా హెగ్డే ఆడిపాడింది. ఆమిర్ ఖాన్ కూడా అతిథి పాత్రలో మెరవనున్నారు.
వివరాలు
'కూలీ నెంబర్ 1421'గా రజనీకాంత్
తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమాను ఐమ్యాక్స్ ఫార్మాట్లో కూడా తెరపైకి తీసుకువస్తున్నారు. ఇందులో రజనీకాంత్ 'కూలీ నెంబర్ 1421'గా దేవా అనే పాత్రలో ఆకట్టుకోనున్నారు. నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, మహేంద్రన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.