LOADING...
Rajinikanth: 'బాషా' శత దినోత్సవ వేడుకల్లో జయలలితపై వ్యాఖ్యలు.. 30 ఏళ్ల తర్వాత స్పందించిన రజనీకాంత్‌
'బాషా' శత దినోత్సవ వేడుకల్లో జయలలితపై వ్యాఖ్యలు

Rajinikanth: 'బాషా' శత దినోత్సవ వేడుకల్లో జయలలితపై వ్యాఖ్యలు.. 30 ఏళ్ల తర్వాత స్పందించిన రజనీకాంత్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2025
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ 'బాషా' చిత్రం శతదినోత్సవ వేడుకల్లో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ వ్యాఖ్యల తర్వాత చోటుచేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో ఆయన ఆ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా రాజకీయంగా స్పందించారు. సుమారు 30 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి రజనీకాంత్ తాజాగా స్పందించారు. ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకుడు ఆర్‌.ఎం. వీరప్పన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ 'ఆర్‌వీఎం: ది కింగ్‌మేకర్‌' లో రజనీకాంత్‌ పాల్గొన్నారు. ఇందులో నిర్మాత వీరప్పన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. వీరిద్దరి కలయికలో రూపొందిన 'బాషా' సినిమా తాలూకు స్మృతులను, శతదినోత్సవ వేడుకల సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు.

వివరాలు 

తమిళనాడులో పెరిగిపోతున్న బాంబుల సంస్కృతి

"ఆర్‌.ఎం. వీరప్పన్ స్థాపించిన సత్య మూవీస్‌ బ్యానర్‌లో 'బాషా' సినిమా నిర్మించారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో 1995లో చెన్నైలో వంద రోజుల వేడుకలు ఘనంగా నిర్వహించాం. ఆ వేడుకల్లో వీరప్పన్‌ అప్పట్లో అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రి పదవిలో ఉన్నప్పటికీ హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా, తమిళనాడులో పెరిగిపోతున్న బాంబుల సంస్కృతి (బాంబ్ కల్చర్) గురించి నేను వ్యాఖ్యానించాను. నా ప్రసంగం వల్ల ఆయనకు మంత్రిపదవి కోల్పోవాల్సి వచ్చింది. ఇది నాకు చాలా బాధ కలిగించింది" అని రజనీకాంత్‌ తెలిపారు.

వివరాలు 

నీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు

"ఆ వేదికపై నీ స్పీచ్ జరుగుతున్నప్పుడు ఆయన ఎందుకు నిరసన తెలియజేయలేదో?" అని జయలలిత అప్పట్లో,ప్రశ్నించారట. ఈ విషయం తెలిసిన వెంటనే నేను వీరప్పన్‌గారికి ఫోన్‌ చేసి, ఈ విషయంపై జయలలితతో మాట్లాడతానని చెప్పాను. కానీ ఆయన అంగీకరించలేదు. అయన నన్ను చూస్తూ - 'నీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు. నాకు పదవుల అవసరం లేదు. నేను వాటికి తగినవాడిని కాదు' అని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆయన సాధారణ జీవితంలోకి వెళ్లిపోయారు. రాజకీయంగా జయలలితకు వ్యతిరేకంగా నిలవడానికి ఈ సంఘటనే ఒక ప్రధాన కారణంగా మారింది," అని రజనీకాంత్ వివరించారు.

వివరాలు 

రాష్ట్రవ్యాప్తంగా చర్చ

'బాషా' చిత్రానికి సురేశ్ కృష్ణ దర్శకత్వం వహించగా, ఇది ఆర్‌.ఎం. వీరప్పన్ సమర్పణలో 1995 జనవరిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. శతదినోత్సవ వేడుకల్లో రజనీకాంత్‌ చేసిన ప్రసంగంలో ఆయన వారసత్వ రాజకీయాలపై విమర్శలు చేశారు. అదే సమయంలో తమిళనాడులో బాంబుల సంస్కృతి పెరుగుతోందన్న వ్యాఖ్యలు చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న జయలలిత ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని అనేక మంది భావించారు. దీంతో ఆ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీశాయి.