LOADING...
Bihar SIR: బిహార్‌ ఎస్‌ఐఆర్‌ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. గతంతో పోలిస్తే 'ఓటర్‌-ఫ్రెండ్లీ'నే కదా! 
బిహార్‌ ఎస్‌ఐఆర్‌ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. గతంతో పోలిస్తే 'ఓటర్‌-ఫ్రెండ్లీ'నే కదా!

Bihar SIR: బిహార్‌ ఎస్‌ఐఆర్‌ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. గతంతో పోలిస్తే 'ఓటర్‌-ఫ్రెండ్లీ'నే కదా! 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) విషయంలో జరుగుతున్న వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి కీలకంగా స్పందించింది. గతంలో కేవలం ఏడు రకాల ధ్రువీకరణ పత్రాలను మాత్రమే అంగీకరించగా, ఇప్పుడు 11 రకాల పత్రాలను గుర్తించడం ఓటర్లకు మరింత అనుకూలమని కోర్టు అభిప్రాయపడింది. జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చీ లతో కూడిన ధర్మాసనం విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఆధార్‌ తప్పించి అనేక పత్రాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని గుర్తు చేసింది.

వివరాలు 

పత్రాల సంఖ్య పెరిగినప్పటికీ,అవన్నీ అందరికీ అందుబాటులో ఉండవు 

కోర్టు అభిప్రాయం ప్రకారం.. "గతంలో నిర్వహించిన సమ్మరీ రివిజన్‌లో ఏడు పత్రాలకే అనుమతి ఇచ్చారు. కానీ ఈసారి ఎస్‌ఐఆర్‌లో 11 పత్రాలను అనుమతించడం చూస్తే, ఇది ఓటర్లకు అనుకూలంగా కనిపిస్తోంది. పిటిషనర్ల వాదన ప్రకారం ఆధార్‌ అనుమతించకపోవడంపై ఆందోళన ఉన్నా, వాస్తవానికి అనేక ఇతర పత్రాలను కూడా ఆమోదిస్తున్నారు" అని పేర్కొంది. అయితే,పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ ఈ విషయంపై విభేదించారు. పత్రాల సంఖ్య పెరిగినప్పటికీ,అవన్నీ అందరికీ అందుబాటులో ఉండవని ఆయన వాదించారు. ఉదాహరణగా పాస్‌పోర్ట్‌ విషయమై మాట్లాడుతూ,రాష్ట్రంలో కేవలం ఒకటి లేదా రెండు శాతం ప్రజల వద్ద మాత్రమే పాస్‌పోర్ట్‌ ఉందని చెప్పారు.

వివరాలు 

బిహార్‌లో 36 లక్షల మందికి పైగా పాస్‌పోర్ట్‌

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. బిహార్‌లో 36 లక్షల మందికి పైగా పాస్‌పోర్ట్‌ ఉందని, ఈ సంఖ్య తక్కువ కాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విభాగాల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగానే ఈ పత్రాల జాబితా రూపొందించబడుతుందని జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చీ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆగస్టు 12న జరిగిన మరో విచారణలో సుప్రీం కోర్టు,పౌరసత్వానికి సాక్ష్యంగా ఆధార్‌ లేదా ఓటరు గుర్తింపు కార్డును ఒక్కటే ఆధారంగా పరిగణించలేమన్న ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. ఈ పత్రాలకు తోడు మరికొన్ని ఆధారాలు ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. అయితే,ఈ విషయంలో స్వతంత్రంగా సమీక్ష అవసరమని కూడా పేర్కొంది. ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉందా అనే అంశాన్ని ముందుగా స్పష్టంచేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.