
Jammu Kashmir: వైష్ణో దేవి యాత్ర మార్గంలో ఘోర ప్రమాదం.. 30 మంది యాత్రికులు మృతి, పలువురికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 30కి చేరింది. అర్థ్కువారీ దగ్గర మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇప్పటివరకు 30 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అధికారుల ప్రకారం, గత కొన్ని రోజులుగా కురుస్తున్న తీవ్ర వర్షాలే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. మొదట ఈ ఘటనలో 9 మంది మృతిచెందినట్లు ప్రకటించగా, అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరణాల సంఖ్య పెరిగింది. భక్తుల భద్రత దృష్ట్యా, యాత్రికులు వెళ్లే రెండు మార్గాలను అధికారులు తక్షణమే మూసివేశారు.
వివరాలు
జమ్మూకశ్మీర్ అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించిన హోంమంత్రి అమిత్ షా
ఈ ఘటనపై శ్రీ మాతా వైష్ణో దేవి తీర్థక్షేత్ర బోర్డు స్పందించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సర్దుబాటు అయ్యే వరకు యాత్రికులు తమ యాత్రను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే యాత్రకు రావాలని స్పష్టం చేసింది. అంతేకాక, భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసినట్లు బోర్డు ప్రకటించింది. ఈ దుర్ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వెంటనే జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ఫోన్లో మాట్లాడారు.
వివరాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ
సహాయక చర్యల పురోగతిపై వివరాలు తెలుసుకుని, బాధితులకు అవసరమైన సహాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా, కేవలం జమ్మూకశ్మీర్లోనే కాకుండా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు విస్తృత నష్టం కలిగిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా ఆయా రాష్ట్రాల్లోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.