Page Loader
బిపర్‌జాయ్‌ తుఫాను ధాటికి 95 రైళ్లు రద్దు, 30 వేల మందికిపైగా పునరావాసం
95 రైళ్లు రద్దు, 30 వేల మందికిపైగా పునరావాసం

బిపర్‌జాయ్‌ తుఫాను ధాటికి 95 రైళ్లు రద్దు, 30 వేల మందికిపైగా పునరావాసం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 14, 2023
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

బిపర్‌జాయ్‌ తుఫాను కారణంగా గుజరాత్ లోని తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా మొత్తం 95 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. మరో 58 రైళ్ల ప్రయాణ దూరాన్ని కుదిస్తూ రైళ్లు బయలుదేరే స్టేషన్, గమ్యస్థానాల్లో మార్పులు చేర్పులు చేసినట్లు వివరించింది. గురువారం సాయంత్రానికి తుపాను గుజరాత్‌ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు సాయంత్రం నాటికి అరేబియా సముద్రం తీరంలోని కచ్‌లో ఉన్న జఖౌ పోర్టు సమీపంలో తీరం దాటునుంది. గుజరాత్‌పై తుఫాను విరుచుకుపడి, విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

DETAILS

తీరాల్లో 6 మీటర్ల ఎత్తున అలలు పోటెత్తే అవకాశం : ఐఎండీ

తుపాను తీరం తాకే సమయంలో గరిష్ఠంగా గంటకు 150 కిలోమీటర్ల మేర బలమైన గాలులు వీయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సౌరాష్ట్ర, కచ్‌ తీరాల్లో సుమారు 6 మీటర్ల ఎత్తున అలలు పోటెత్తుతాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం బిపర్‌జాయ్‌ తుఫాను పోర్‌ బందర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో తీర ప్రాంత జిల్లాలకు చెందిన దాదాపు 30 వేల మంది ప్రజలను అధికారులు తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసి అక్కడికి తరలించారు. సుమారు 95 రైళ్లను రద్దు చేశామన్న అధికారులు, జూన్‌ 15 వరకు రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

DETAILS

ఆ సున్నిత ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి : ఐఎండీ

ఏషియన్ లయన్స్ కి ఏకైక ఆవాసమైన గిర్‌ నేషనల్‌ పార్కు (వన్యప్రాణుల అభయారణ్యం), ప్రముఖ శివ క్షేత్రం, జ్యోతిర్లింగం సోమనాథ్‌ వంటి ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని ఐఎండీ అధికారులు ప్రభుత్వానికి సూచనలు చేశారు. బిపర్‌జాయ్‌ తుఫాను తీరం దాటే రోజున కచ్‌, దేవభూమి ద్వారకా, జామ్‌నగర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షం కురవనుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని పోర్‌బందర్‌, రాజ్‌ కోట్‌, మోర్బీ సహా నాఘర్‌ ప్రాంతాల్లోనూ అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.