Sanjay Singh arrest: నరేంద్ర మోదీకి భయం పట్టుకుంది : కేజ్రీవాల్
ఆప్ కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ అరెస్టు చేసింది. మనీల్యాండరింగ్ ఆరోపణలపై బుధవారం ఉదయం దిల్లీలోని ఎంపీ నివాసంలో అధికారులు సోదాలు చేపట్టారు. దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం పీఎంఎల్ఏ కింద అరెస్టు చేసినట్లు అధికారులు ధృవీకరించారు . సంజయ్ సింగ్ అరెస్టుపై ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో నేడు న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయం వెలుపల నిరసన తెలుపనున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ కుటుంబాన్ని కలిసిన తర్వాత విలేకర్లతో మాట్లాడారు.
భారతదేశంలో అత్యంత అవినీతిపరుడు మోదీనే : క్రేజీవాల్
ప్రధాని నరేంద్ర మోదీకి భయం పట్టుకుందని, ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ఏమిటని మండిపడ్డారు. ఆప్ "హార్డ్ కోర్ నిజాయితీ గల పార్టీ" అని పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన సంజయ్ సింగ్ను అరెస్టు చేశారని, దేశంలోనే పెద్ద అవినీతిపరుడు మోదీనే అని ఆయన మండిపడ్డారు . ఇదిలా ఉండగా, అవినీతి రహిత భారత్ నిర్మాణానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే సంజయ్ సింగ్ను అరెస్టు చేసినట్లు, ఆప్పై భారతీయ జనతా పార్టీ ఎదురుదాడి చేసింది.
ప్రజల నమ్మకాన్ని అప్ పార్టీ వమ్ము చేసింది : మనోజ్ తివారీ
ఈడి ఎక్సైజ్ కేసులో అప్రూవర్లుగా మారడానికి దినేష్ అరోరా, రాఘవ్ మాగుంటలను ఢిల్లీ కోర్టు అనుమతించిన ఒక రోజు తర్వాత సింగ్ అరెస్టు జరగడం గమనార్హం. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తర్వాత మద్యం కుంభకోణంలో అరెస్టయిన రెండో వ్యక్తి సంజయ్ సింగ్. ఫిబ్రవరిలో సిసోడియాను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేసింది. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ, బీజేపీ నేతలు భయపడుతున్నారని, బీహార్ లో కూడా ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని ఆప్ పార్టీ వమ్ము చేసిందని, ఆప్ నేతలు అవినీతి పరులని ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఆరోపించారు.