Page Loader
CM Revanthreddy: హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌.. ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు
హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌

CM Revanthreddy: హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌.. ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2025
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో రెండోరోజైన శుక్రవారం భారీ పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమైన ఒప్పందాలను కుదుర్చుకుంది. డిజిటల్ మార్పు,ఐటీ సేవలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్‌టీటీ డేటా,అలాగే ఏఐ ఆధారిత క్లౌడ్ ప్లాట్‌ఫామ్ అయిన నెయిసా నెట్‌వర్క్స్,హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ క్లస్టర్ కోసం రూ.10,500 కోట్ల పెట్టుబడి ఖర్చు చేస్తూ,తెలంగాణ ప్రభుత్వంతో కలిసి త్రైపాక్షిక ఒప్పందానికి (MoU) సంతకాలు చేశారు. ఈ ఒప్పందం టోక్యోలోని ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరింది. ఇందులో ఎన్‌టీటీ డేటా,నెయిసా ప్రతినిధులు శరద్ సంఘీ, అలోక్ బాజ్‌పాయ్, కెన్ కట్సుయామా, తడావోకి నిషిమురా పాల్గొన్నారు.

వివరాలు 

ప్రపంచ స్థాయి కంపెనీ భాగస్వామ్యం 

టోక్యోలో ప్రధాన కార్యాలయం కలిగిన ఎన్‌టీటీ డేటా, 50 కంటే ఎక్కువ దేశాల్లో 1.93 లక్షల మంది ఉద్యోగులతో ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ప్రఖ్యాతి గాంచిన సంస్థ. ఇది ప్రపంచంలోని టాప్ 3 డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ పబ్లిక్ సర్వీసెస్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, తయారీ, టెలికాం రంగాలకు సేవలందిస్తోంది. నెయిసా సంస్థ ప్రత్యేకమైన ఏఐ కంప్యూటింగ్ సొల్యూషన్స్ అందించడంలో నిపుణత కలిగి ఉంది.

వివరాలు 

హైదరాబాద్‌లో శక్తివంతమైన డేటా క్లస్టర్ 

ఈ ప్రాజెక్ట్‌ కింద హైదరాబాద్‌లో నిర్మించబోయే 400 మెగావాట్ల డేటా సెంటర్‌ క్లస్టర్‌ దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలుగా నిలుస్తుంది. ఇది దాదాపు 25,000 GPUల సామర్థ్యం కలిగి ఉండబోతుంది. తెలంగాణను దేశంలోని ఏఐ రాజధానిగా మార్చే లక్ష్యంతో ఈ క్లస్టర్‌ రూపుదిద్దుకుంటోంది. దీన్ని 500 మెగావాట్ల విద్యుత్‌ గ్రిడ్‌తో, పునరుత్పాదక శక్తిని వినియోగిస్తూ నడిపించనున్నారు. లిక్విడ్ ఇమ్మర్షన్ వంటి ఆధునిక శీతలీకరణ సాంకేతికతలను ఇందులో ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ అత్యున్నత ఈఎస్‌జీ ప్రమాణాలతో అభివృద్ధి కానుంది. తెలంగాణ విద్యా సంస్థలతో భాగస్వామ్యంగా పనిచేస్తూ, రాష్ట్ర డిజిటల్ మిషన్‌కు తోడ్పాటును అందిస్తుంది.

వివరాలు 

సరళీకృత విధానాలతో పెట్టుబడులకు ఊతం 

ఈ ఒప్పందం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక, సరళీకృత పారిశ్రామిక విధానాల వలన భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిల్ విండో అనుమతుల విధానం, ప్రతిభావంతులైన మానవ వనరుల లభ్యత వలన రాష్ట్రం ఏఐ రంగంలో ముందున్నదని తెలిపారు. AWS, STT, టిల్‌మన్ హోల్డింగ్స్, CTRL-S వంటి కంపెనీల డేటా సెంటర్ల ప్రాజెక్టుల సరసన ఇప్పుడు ఎన్‌టీటీ పెట్టుబడి కూడా చేరిందని, దీనివల్ల హైదరాబాద్‌ దేశంలోనే ప్రముఖ డేటా హబ్‌గా నిలుస్తుందని తెలిపారు.

వివరాలు 

టీటీడీఐ మూడో ఫ్యాక్టరీ పెట్టుబడి 

విద్యుత్ పంపిణీ రంగంలో తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన టీటీడీఐ (Toshiba Transmission & Distribution Systems India), తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ముందుకొచ్చింది. హైదరాబాద్‌ సమీపంలోని రుద్రారంలో సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీను ఏర్పాటు చేయనుంది. అదనంగా ఇప్పటికే ఉన్న ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని విస్తరిస్తూ పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్,డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్‌గేర్‌ (GIS) ఉత్పత్తిని మెరుగుపరిచే ప్రణాళికలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్ట్‌కి రూ.562 కోట్ల పెట్టుబడి వినియోగించనున్నారు. ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్న టీటీడీఐ, ఇది మూడో ఫ్యాక్టరీగా నిర్మించనుంది. టోక్యోలో జరిగిన ఒప్పంద సంతకాల కార్యక్రమంలో సీఎంతో పాటు జయేశ్ రంజన్,తోషిబా డైరెక్టర్ హిరోషి కనెటా, టీటీడీఐ చైర్మన్ హిరోషి ఫురుటా పాల్గొన్నారు.

వివరాలు 

మూసీ ప్రాజెక్టుపై ప్రచార దృశ్యాలు 

పారిశ్రామిక రంగానికి తోషిబా పెట్టుబడి కొత్త శక్తిని ఇస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ రోడ్‌షోలో తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించిన వీడియోల ద్వారా, ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నెట్ జీరో ఇండస్ట్రియల్ సిటీ ప్రాజెక్ట్, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ వంటి ప్రణాళికలు జపాన్ పారిశ్రామికవేత్తల మనస్సులను ఆకర్షించాయి. ఎలక్ట్రానిక్స్, ఏఐ, ఈవీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను జయేశ్ రంజన్ వివరించారు. 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత రాయబారి సీబీ జార్జ్, జెట్రో డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటానీ, తెలంగాణతో సంబంధాలు మరింత బలోపేతం చేయాలని అన్నారు.

వివరాలు 

సుమిదా రివర్ ఫ్రంట్ - మూసీ ప్రాజెక్టుకు మోడల్ 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం టోక్యోలోని సుమిదా రివర్ ఫ్రంట్‌ను సందర్శించింది. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దిన తీరును గమనించారు. టోక్యో నగరం మధ్య నుంచి ప్రవహించే సుమిదా నది పక్కన ఉన్న రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ఎలివేటెడ్ కారిడార్‌లు, ఆధునిక మౌలిక సదుపాయాల ఏర్పాటును పరిశీలించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఇది మార్గదర్శిగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ఒక అందమైన, ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దడంలో ఈ ప్రాజెక్ట్ కీలకమవుతుందని ఆయన ట్విటర్‌లో తెలిపారు.

వివరాలు 

తెలంగాణలో భవిష్యత్తు నిర్మాణానికి పిలుపు 

జపాన్ పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నిపుణులను అందిస్తుందని, స్థిరమైన విధానాలతో బిజినెస్‌కు అనుకూలమైన వాతావరణం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఏఐ డేటా సెంటర్లు వంటి రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ''టోక్యో నగరం నాకు చాలా ప్రేరణ ఇచ్చింది. మీ మౌలిక సదుపాయాలు, పర్యావరణ సంరక్షణ, ప్రజల మర్యాద, క్రమశిక్షణ నిజంగా ఆదర్శంగా ఉన్నాయి. ఇదే స్పూర్తితో హైదరాబాద్ అభివృద్ధి బాటలో సాగుతుంది'' అని సీఎం పేర్కొన్నారు.