
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాయం అవసరం : చంద్రబాబు నాయుడు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి అవసరమైన సాయం గురించి ప్రస్తావించారు.
వైసీపీ ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్తం చేసి, ఐదేళ్లకు రావాల్సిన రెవెన్యూలోటు గ్రాంటును మూడేళ్లలోనే ఉపయోగించడాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సాయం అవసరమని చంద్రబాబు ప్రధానమంత్రిని కోరారు.
స్వర్ణాంధ్ర విజన్ - 2047ను ప్రధానమంత్రికి అందజేత
వాజ్పేయీ శతజయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి దిల్లీలో ఉన్న చంద్రబాబు, స్వర్ణాంధ్ర విజన్ - 2047 గురించి ప్రధానమంత్రికి వివరించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం తరఫున అన్నిరకాలుగా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వచ్చే నెలలో ప్రారంభించే భారీ ప్రాజెక్టుల గురించి ప్రధానమంత్రితో చర్చించారు.
Details
ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై చర్చ
చంద్రబాబు, పోలవరం, అమరావతి ప్రాజెక్టుల పురోగతి గురించి ప్రధానమంత్రికి వివరించారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం 94 కేంద్ర పథకాల అమలును నిలిపి వేయడం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించారు.
పునఃప్రారంభమైన 74 పథకాలకు కేంద్రం పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేయాలని కోరారు.
అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముడిఖనిజం సరఫరా, అవసరమైన అనుమతులు త్వరగా లభించేలా చూడాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
Details
కేంద్రమంత్రులతో సమావేశాలు
హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్లతో వేర్వేరుగా సమావేశమై రాష్ట్రానికి తగిన నిధులు వచ్చే బడ్జెట్లో చేర్చాలని కోరారు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో విశాఖ ఉక్కు పునరుజ్జీవం కోసం కేంద్రం చేయాల్సిన సాయంపై చర్చించారు.
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో రైల్వే ప్రాజెక్టుల వేగవంతం, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, విశాఖ రైల్వే జోన్ ప్రారంభంపై చర్చలు జరిగాయి.
ఎన్డీయే పక్షాల సమన్వయం
ఎన్డీయే పక్షాల సమావేశంలో పార్టీల మధ్య సమన్వయంతో పని చేయడం, కేంద్ర పథకాల అమలు వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
'వికసిత్ భారత్ 2047' లక్ష్యాన్ని సాధించడానికి ఎన్డీయే కట్టుబడి ఉందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు.
Details
వాజ్పేయీకి నివాళి
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీని భారతజాతి గర్వించదగ్గ నేతగా చంద్రబాబు కొనియాడారు. ''నేషన్ ఫస్ట్'' అనే దృక్పథంతో ఆయన సేవలు చేసిన తీరు చిరకాలం గుర్తుండిపోతుందని చెప్పారు.
12 గంటలపాటు నిరవధిక కృషి
ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 వరకు చంద్రబాబు ఢిల్లీలో తీరిక లేకుండా పర్యటించారు.
వాజ్పేయీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించడంతో ప్రారంభమైన ఈ పర్యటన, వివిధ నాయకులు, కేంద్రమంత్రులతో సమావేశాల ద్వారా కొనసాగి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో భేటీతో ముగిసింది.
ఈ పర్యటనలో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలకమైన అంశాలను చర్చిస్తూ కేంద్రం నుంచి అవసరమైన సహాయాన్ని అందించేందుకు మరింత సమన్వయం చేశారు.