LOADING...
AP Cabinet Meet: నేడు ఏపీ క్యాబినెట్ భేటీ… పలు కీలక అంశాలపై చర్చ
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ… పలు కీలక అంశాలపై చర్చ

AP Cabinet Meet: నేడు ఏపీ క్యాబినెట్ భేటీ… పలు కీలక అంశాలపై చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమవుతోంది. ఈ భేటీ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా, నూతన రాజధాని నిర్మాణానికి సంబంధించి 20,494 ఎకరాల భూమిని సమీకరించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇప్పటికే ప్రభుత్వం 54,000 ఎకరాల భూమిని సేకరించినట్టు సమాచారం. ఇంకా 20 ఎకరాల భూమి సమీకరణను లక్ష్యంగా పెట్టుకొని, దీనిపై కూడా ఈరోజు సమావేశంలో చర్చించనున్నారు.

వివరాలు 

హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌కు సంబంధించిన అంశంపై చర్చ 

అమరావతిలో నాలుగు అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. అలాగే, రాజధాని అభివృద్ధి పనులలో భాగంగా అవసరమైన ఇసుక డీసిల్టేషన్‌కి అనుమతినివ్వాలా అనే అంశంపై కూడా చర్చ జరగనుంది. హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌కు సంబంధించిన అంశంపై చర్చించిన తర్వాత కేబినెట్‌ నుంచి అనుమతి వెలువడే అవకాశం ఉంది. ఇంతకు ముందు నిర్ణయించిన ప్రకారం అమరావతిలో అల్లూరి సీతారామరాజు, అమరజీవి వంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల స్మారక చిహ్నాల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం మద్దతు ప్రకటించనుంది. అదేవిధంగా, అమరావతిలోని పలు సంస్థలకు భూముల కేటాయింపుపై కూడా ప్రభుత్వం మంతనాలు జరిపి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

వివరాలు 

బంగారుపాళ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంశంపై చర్చ 

కర్నూలు జిల్లాలోని బనకచర్ల ప్రాజెక్టు సంబంధిత అంశంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. అలాగే, "సుపరిపాలన - తొలి అడుగు" కార్యక్రమంపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను తీసుకొని సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇక బంగారుపాళ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటన అంశంపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ఆ పర్యటన సందర్భంగా శాంతిభద్రతల పరంగా సమస్యలపై మంత్రులు తమ అభిప్రాయాలు వెల్లడించనున్నారు.

వివరాలు 

రైతు భరోసా పథకంపై మంత్రివర్గం దృష్టి 

రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోన్న "తల్లికి వందనం" కార్యక్రమ ప్రగతిపై, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలన్న ప్రతిపాదనపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. రైతు భరోసా పథకంపై మంత్రివర్గం మరింతగా దృష్టి పెట్టనుంది. అంతేకాకుండా, పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన భూకేటాయింపులు కూడా ఈ రోజు కేబినెట్‌ చర్చలో కీలక అంశంగా ఉండబోతున్నాయి. పలు నూతన బిల్లులకు కూడా ఈ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.