Baba Siddique Murder: బాబా సిద్ధిక్ హత్య నిందితుడికి బోన్ ఆసిఫికేషన్ పరీక్ష.. ఏం తేలిందో తెలుసా?
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ కోర్టులో తాను మైనర్ అని పేర్కొన్నాడు. అతని వయస్సు 17 సంవత్సరాలే అని చెప్పడంతో, కోర్టు అతని వయస్సును నిర్ధారించేందుకు బోన్ ఆసిఫికేషన్ టెస్టు చేయాలని ఆదేశించింది. ఈ పరీక్షలో, కొన్ని ఎముకల ఎక్స్-రేలు తీసుకుని వయసును నిర్ధారిస్తారు. ముంబై పోలీసులు ఈ టెస్ట్ నిర్వహించగా, కశ్యప్ మైనర్ కాదని నిర్ధారణ అయ్యిందని ఒక అధికారి తెలిపారు. శనివారం, బాంద్రాలో బాబా సిద్ధిఖీని ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే, అందులో ఒకడే ధర్మరాజ్ కశ్యప్.
పరారీలో మూడో నిందితుడు
శిక్షల నుంచి తప్పించుకునేందుకు కశ్యప్ తన వయసు తక్కువగా చూపించడానికి ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. అతను మైనర్ కాదని తేలిన తరువాత, కోర్టు అతనిని అక్టోబర్ 21 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. ముంబై పోలీసులు హర్యానాకు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్ (23), ఉత్తరప్రదేశ్కు చెందిన ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ (19)ను అరెస్ట్ చేశారు. కాల్పుల సమయంలో ఉన్న మూడో నిందితుడు పరారీలో ఉన్నాడు, కేసు విచారణ కొనసాగుతోంది.