Page Loader
Battery storage project: రాష్ట్రంలో 3 వేల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టులు.. వెయ్యి మెగావాట్లకు టెండర్లు పిలిచిన విద్యుత్‌ సంస్థలు
రాష్ట్రంలో 3 వేల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టులు

Battery storage project: రాష్ట్రంలో 3 వేల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టులు.. వెయ్యి మెగావాట్లకు టెండర్లు పిలిచిన విద్యుత్‌ సంస్థలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2025
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో 1,000 మెగావాట్‌ అవర్స్‌ సామర్థ్యం గల మరో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టం (BESS) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం కేంద్రం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (VGF) పథకం కింద మద్దతు నిధులను అందించనుంది. ఇప్పటికే 2,000 మెగావాట్‌ అవర్స్‌ విద్యుత్‌ నిల్వ సామర్థ్యం కలిగిన బీఈఎస్‌ఎస్‌ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం 3,000 మెగావాట్ల విద్యుత్‌ను నిల్వ చేయగల సాంకేతిక వ్యవస్థ రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 19,000 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు ఉన్నాయి. వీటిలో 7,800 మెగావాట్లు పునరుత్పాదక విద్యుత్‌.. అంటే సౌరశక్తి, వాయు విద్యుత్‌ వంటి వాటి నుంచే.

వివరాలు 

వచ్చే ఏడాదిలో మరో 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచీ ఉత్పత్తి

ఈ పునరుత్పాదక విద్యుత్‌ను మస్ట్‌ రన్‌ విధానంలో తప్పనిసరిగా గ్రిడ్‌కి చేర్చాల్సిన నిబంధనల వల్ల, పగటి వేళల్లో సుమారు 1,500 మెగావాట్ల అధిక విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. త్వరలో వచ్చే ఏడాదిలో మరో 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచీ ఉత్పత్తి మొదలుకానుంది. ఇది కూడా గ్రిడ్‌కు వస్తే, బేస్‌లోడ్‌ నిర్వహణలో సమస్యలు తలెత్తే అవకాశముందని విద్యుత్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం బీఈఎస్‌ఎస్‌ సాంకేతికత ద్వారా మొత్తం 4,000 మెగావాట్‌ అవర్స్‌ విద్యుత్‌ను నిల్వ చేయగల ప్రాజెక్టులను ఆమోదించాలంటూ కేంద్రానికి ప్రతిపాదన పంపించింది. ఇప్పటికే 2,000 మెగావాట్‌ అవర్స్‌ సామర్థ్యం గల బీఈఎస్‌ఎస్‌ ప్రాజెక్టుల కోసం ఇంధన శాఖ టెండర్లు జారీ చేసింది.

వివరాలు 

థర్మల్‌ విద్యుత్‌ బ్యాక్‌డౌన్‌ చేసిన తర్వాతా.. 

రాష్ట్రంలో పగటి వేళల్లో విద్యుత్‌ అవసరం ఆశించిన స్థాయికి చేరడం లేదు.ఎక్కువగా గరిష్ఠ డిమాండ్‌ ఒకే ఒక టైం బ్లాక్‌లో 13,000 మెగావాట్లు ఉంటున్నా,సాధారణంగా ఎక్కువ టైం బ్లాక్‌లలో (ఒక టైం బ్లాక్‌ అంటే 15 నిమిషాలు) డిమాండ్‌ 8,000 నుండి 8,500 మెగావాట్ల మధ్యలోనే ఉంది. ఈ కారణంగా,జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లను తగ్గించిన తర్వాత కూడా రోజు ఆదికంగా 1,500 మెగావాట్ల విద్యుత్‌ మిగిలిపోతుంది. అదే సమయంలో జెన్‌కో థర్మల్‌ యూనిట్లను పూర్తిస్థాయిలో నడిపితే,అదనంగా మరో 1,000 మెగావాట్ల విద్యుత్‌ మిగులుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మిగులు విద్యుత్‌ను అవసరమైన సమయంలో వినియోగించుకునేందుకు నిల్వ చేసే వసతి అవసరమై,రాష్ట్ర ప్రభుత్వం స్టోరేజ్‌ ప్రాజెక్టుల ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

కొత్త ప్రాజెక్టుల విద్యుత్‌ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే..? 

పీఎం సూర్యఘర్‌ పథకం కింద, 20 లక్షల ఇళ్లపై ఏర్పాటు కానున్న సౌర విద్యుత్‌ వ్యవస్థల ద్వారా సుమారు 4,000 మెగావాట్ల విద్యుత్‌ రాష్ట్రానికి లభించనుంది. పీఎం కుసుమ్‌ పథకం కింద ఫీడర్ల స్థాయిలో ఏర్పాటు చేస్తున్న చిన్న సౌర విద్యుత్‌ ప్లాంట్ల ద్వారా వచ్చే ఏడాది మార్చికి 1,400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో సెకి కంపెనీతో కుదిరిన ఒప్పందం ప్రకారం 7,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ను దశల వారీగా తీసుకోవాలి. ఈ ఒప్పందానికి అనుగుణంగా, ఈ ఏప్రిల్‌ నుంచే 3,000 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేయాలని సెకి ఒత్తిడి చేస్తోంది.

వివరాలు 

పీక్‌ అవర్స్‌లో కూడా మరో నాలుగు గంటల పాటు వినియోగించుకోవచ్చు 

మైలవరం,కడప తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ఆమోదం పొందిన సుమారు 2,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు ఏడాది వ్యవధిలో పూర్తి కావచ్చు. బీఈఎస్‌ఎస్‌ ద్వారా విద్యుత్‌ను తగిన వేళ వినియోగించుకోవచ్చు బీఈఎస్‌ఎస్‌ ప్రాజెక్టుల ద్వారా నిల్వ చేసే విద్యుత్‌ను పగటి వేళలలో, ముఖ్యంగా డిమాండ్‌ ఎక్కువగా ఉన్న నాలుగు గంటల పాటు వినియోగించుకునేలా చేస్తారు. అదేవిధంగా, రాత్రి పీక్‌ అవర్స్‌లో కూడా మరో నాలుగు గంటల పాటు వినియోగించేందుకు వీలుంటుంది. ఈ విధానంలో 1,500 మెగావాట్ల బీఈఎస్‌ఎస్‌ ప్రాజెక్ట్‌ను రెండు సైకిల్స్‌గా వినియోగించడం ద్వారా 3,000 మెగావాట్ల విద్యుత్‌ను నిల్వ చేయగల సామర్థ్యం ఏర్పడనుంది.