
Piyush Goyal: అన్యాయమైన వాణిజ్య పద్ధతులే చైనా వృద్ధికి ఆజ్యం పోశాయి: పీయూష్ గోయెల్
ఈ వార్తాకథనం ఏంటి
చైనా అన్యాయ వాణిజ్య విధానాల ద్వారా తన ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ ఆరోపించారు.
ధరలను తారుమారు చేయడం, అర్థస్పష్టమైన సబ్సిడీలు కల్పించడం, అంతర్జాతీయ వాణిజ్య నియమాలకు విరుద్ధంగా కార్మిక విధానాలను అమలు చేయడం బీజింగ్ ప్రగతికి దారితీస్తున్న కారణాలుగా పేర్కొన్నారు.
సోమవారం విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
గ్లోబల్ మార్కెట్లలో చైనా దూకుడు పెరుగుతుండటంపై గోయల్ ఆందోళన వ్యక్తంచేశారు. దీని ప్రభావం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడుతోందని హెచ్చరించారు.
ఈ పరిస్థితి కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్ని ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు.
వివరాలు
యూపీఏ కాలంలో ఇండియా-చైనా వాణిజ్య లోటు 25రెట్లు పెరిగింది
అందువల్ల అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల్లో మార్పులు తెచ్చే అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
అదే సమయంలో ఆయన యూపీఏ పాలనను కూడా తీవ్రంగా విమర్శించారు.
వాజపేయి హయాంలో ఇండియా-చైనా వాణిజ్య లోటు పరిమితంగా ఉన్నప్పటికీ, యూపీఏ కాలంలో అది 25రెట్లు పెరిగిందని ఆరోపించారు.
అంతేగాక, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్య ఒక రహస్య ఒప్పందం జరిగినట్టు తెలిపారు.
ఆ ఒప్పందం మనకు ఆశ్చర్యం కలిగించిందని, దాని తరువాత భారత్లోకి దిగుమతి అయ్యే చైనా ఉత్పత్తులపై సుంకాలు గణనీయంగా తగ్గించబడ్డాయని గోయల్ ఆరోపించారు.
దీని ప్రభావంగా భారతదేశానికి చెందిన స్వదేశీ పరిశ్రమలు భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయని,దేశం పూర్తిగా చైనా మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
వివరాలు
వాణిజ్య యుద్ధానికి, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం మొదలయ్యే అవకాశం
ఇక మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కౌంటర్ టారిఫ్లు చైనాను కూడా స్పందించాల్సిన పరిస్థితికి తీసుకెళ్లాయని, దీంతో వాణిజ్య యుద్ధానికి, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం మొదలయ్యే అవకాశం ఉందన్న భయాలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేశాయని ఆయన వివరించారు.