
Chandrababu: 'వైకాపా పాలనను మర్చిపోయి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవ్వండి'.. పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు భరోసా
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ పాలనలో ఎదురైన చేదు అనుభవాలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులను కోరారు. "ఈసారి నేనే సీఎం, నేను ఏమాత్రం నిర్లక్ష్యం చేయను. నూతనంగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం భవిష్యత్తులో కూడా కొనసాగేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నా హామీమీద పెట్టుబడులు పెట్టండి, భయపడాల్సిన అవసరం లేదు" అని ఆయన స్పష్టంచేశారు. విజయవాడ నోవోటెల్లో బుధవారం జరిగిన ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) జాతీయ కార్యవర్గ సమావేశంలో సీఎం మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, ఆర్థిక సంస్కరణలకు ముందు,తరువాత జరిగిన మార్పులు,ఐటీ రంగ అభివృద్ధి,భవిష్యత్తులో అమరావతి ఎలా తీర్చిదిద్దబోతున్నామన్న అంశాలను సమగ్రంగా వివరించారు.
వివరాలు
అమరావతిని శతాబ్దాల పాటు గుర్తుండేలా అభివృద్ధి
క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అభివృద్ధి లక్ష్యంగా, సాంకేతికతతో శక్తివంతమైన గ్రీన్ ఫీల్డ్ నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు. "అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాలతో కలిపి అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. వందేళ్ల తరువాత కూడా ఇలాంటి నగరం ఎవరూ నిర్మించలేరు. సంపద పెరగాలి. ఆ సంపదతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలి. సంపన్నులు పేదలను దత్తత తీసుకొని వారి అభివృద్ధికి తోడ్పడాలి" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.500 నోట్లను కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
వివరాలు
రాయలసీమ, ఉత్తరాంధ్రకు పెట్టుబడి అవకాశాలు విస్తృతం
వెనుకబడిన ప్రాంతాలలో పెట్టుబడులు పెడితే అధికంగా ప్రోత్సాహాకాలు అందిస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, హైటెక్, ఏరోస్పేస్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయని, విశాఖపట్నానికి గూగుల్ సంస్థ రావడానికి సిద్ధమవుతుండగా, సింగపూర్ నుండి సముద్రం గుండా సీ కేబుల్ వేశామని వివరించారు. కెమికల్, ఫార్మా, టూరిజం, స్టీల్ పరిశ్రమల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అవకాశాలున్నాయని తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, ఇన్నోవేషన్లపై దృష్టి పెట్టి వినోదరంగానికీ అవకాశాలను సృష్టిస్తున్నామని వివరించారు.
వివరాలు
ఎన్నికల్లో డబ్బుల పంపిణీ వల్ల దేశానికి నష్టమే
దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో డబ్బుల పంపిణీ ఎక్కువగా జరుగుతుందని, ఈ డబ్బును తిరిగి పొందేందుకు నేతలు వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టిస్తున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తానే మొదటి నుంచి డిజిటల్ కరెన్సీని ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. "రూ.100, రూ.200 నోట్లను తప్ప, రూ.500 నోట్లను రద్దు చేయాలి" అని అన్నారు.
వివరాలు
టెక్నాలజీతో అభివృద్ధి, భద్రత సాధ్యం
"క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తులో అత్యంత కీలకంగా మారుతుంది. టెక్నాలజీ సాయంతో సామాన్యుడికి సేవలందించవచ్చు. టెక్నాలజీ ద్వారా నేరాలను తగ్గించవచ్చు. ప్రస్తుతం అనేకమంది పోలీసులతో నడుపుతున్న నిఘా పనులను ఒకే డ్రోన్తో నిర్వహించవచ్చు. ఆరోగ్య పరిరక్షణ టెక్నాలజీతో సాధ్యమవుతుంది, దీనివల్ల వైద్య ఖర్చులు తగ్గుతాయి. ప్రజారోగ్యం కోసం బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్నాం" అని తెలిపారు.
వివరాలు
పేదరిక నిర్మూలనలో పారిశ్రామికవేత్తల పాత్ర కీలకం
"ఆర్థిక అసమానతలను తొలగించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. సమాజం నుంచి సంపాదించిన వారే తిరిగి సమాజానికి ఉపయోగపడాలి. ఒకవైపు మిలియన్ల, ట్రిలియన్ల ఆస్తులు కలిగినవారు ఉన్నారు, మరోవైపు నిత్యం ఆకలితో బాధపడే పేదలు ఉన్నారు. ఈ అసమానతల నివారణ నాపై ఉన్న బాధ్యత. పీ4 విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం. పారిశ్రామికవేత్తలు పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారికి దిశానిర్దేశం చేయాలి" అని కోరారు.
వివరాలు
ఫిక్కీ ప్రశంసలు - రాష్ట్ర అభివృద్ధి విధానాల ఫలితంగా వేగవంతమైన వృద్ధిరేటు
ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ అగర్వాల్ మాట్లాడుతూ, 2024-25 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు 8.2 శాతంగా దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ఇది సీఎం చంద్రబాబు అభివృద్ధి విధానాలకు నిదర్శనమని ప్రశంసించారు. దేశంలో తొలిసారిగా క్వాంటమ్ వ్యాలీ టెక్పార్క్ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామిక విధానం 4.0, ఎంఎస్ఎంఈ పాలసీ 4.0, క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0 వంటి రంగాల్లో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఫిక్కీ ఉపాధ్యక్షుడు విజయ్ శంకర్ మాట్లాడుతూ, రెండు రాజధానులు నిర్మించే అరుదైన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. 2047 నాటికి దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదగాలన్న లక్ష్యానికి ఫిక్కీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.
వివరాలు
నాస్కామ్తో ఐటీ రంగంలో భాగస్వామ్యం - బ్యాంకింగ్ టెక్నాలజీపై చర్చలు
ఫిక్కీ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ చైర్మన్ ఎం. ప్రభాకరరావు మాట్లాడుతూ,175నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల స్థాపన,రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకలుగా పేర్కొన్నారు.డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును నాస్కామ్ ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలో ఐటీ,సేవల రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని,ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని నాస్కామ్ తెలిపింది. ప్రతికుటుంబాన్నిడేటా యూనిట్గా తీసుకుని డేటా లేక్ను రూపొందించామని,దీనివల్ల సేవల విస్తరణ వేగంగా జరుగుతుందని సీఎం చెప్పారు. "ఐటీ తరువాత క్వాంటమ్ కంప్యూటింగ్ను ప్రోత్సహిస్తున్నాం"అని వివరించారు. బీఎఫ్ఎస్ఐ(బ్యాంకింగ్,ఫైనాన్షియల్ సర్వీసెస్,ఇన్స్యూరెన్స్)రంగాల్లో సాంకేతిక సేవలు అందించేందుకు నాస్కామ్ ఆసక్తి చూపిందని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.