
Himanshu Mathur: ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇరాన్లో భారతీయుడి కిడ్నాప్.. చిత్రహింసలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాలో ఉద్యోగం పొందాలని ఆశతో బయలుదేరిన ఒక యువకుడిని ఇరాన్లో ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. ఆ ముఠాకు రూ. 20 లక్షలు చెల్లించి అతడిని విడిపించుకున్నామని బాధితుడి కుటుంబం మీడియాకు తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,కేరళకు చెందిన హిమాన్షు మాథుర్ ఉద్యోగం కోసం ముందుగా అమన్ అనే వ్యక్తిని కలిశాడు. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్లో ఇమిగ్రేషన్ సేవలు అందిస్తున్నట్లు అమన్ తనను పరిచయం చేసుకున్నాడు. అమన్ హిమాన్షుని నమ్మించడానికి, "కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికెట్" కోర్సు పూర్తి చేస్తే షిప్పింగ్ రంగంలో ఉద్యోగం దొరుకుతుందని చెప్పాడు. అంతేకాదు, ఆస్ట్రేలియాలో వర్క్ వీసా పొందడంలో మార్గం సులభం అవుతుందని హిమాన్షుని నమ్మించారట. దీంతో హిమాన్షు నోయిడాలో ఆ కోర్సు పూర్తి చేశాడు.
వివరాలు
జకార్తా నుండి ఢిల్లీకి హిమాన్షు, అమన్, విశాల్
ఆగస్టు ప్రారంభంలో, అమన్ మళ్లీ హిమాన్షును సంప్రదించాడు. తాను ఇండోనేషియాలో ఉన్నానని, రూ. 19 లక్షలకు వీసా ఇవ్వడానికి ఒక ఏజెంట్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అందువల్ల హిమాన్షు ఢిల్లీ నుంచి జకార్తాకు బయలుదేరాడు. అక్కడ పానిపట్కు చెందిన విశాల్ అనే వ్యక్తిని కలిశాడు. ఆగస్టు 9న, కర్నాల్కు చెందిన తమ వ్యక్తి వస్తాడని, అతడికి రూ. 12 లక్షలు ఇచ్చి, మిగతా రూ. 7 లక్షలు తర్వాత చెల్లించాలని సూచించారు. మూడు వారాల తర్వాత హిమాన్షు, అమన్, విశాల్ జకార్తా నుండి ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఆగస్టు 29న, ఒప్పందం ప్రకారం, అమన్తో కలిసి హిమాన్షు టెహ్రాన్ వెళ్లాడు.అక్కడి నుంచి తనను ఆస్ట్రేలియాకు పంపిస్తారని హిమాన్షు భావించాడు.
వివరాలు
రూ. 20 లక్షలు తీసుకుని విడుదల చేసిన ముఠా
అయితే, అక్కడే ఒక ముఠా వీరిని కిడ్నాప్ చేసి చాబహార్కు తీసుకెళ్లింది. హిమాన్షుతో ఏజెంట్గా పరిచయం చేసిన మిథు కూడా ఈ ముఠాలో భాగమని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం,కిడ్నాపర్లు హిమాన్షును మెటల్ పైపులతో కొట్టారు,అవసరమైన డబ్బులు ఇవ్వకపోతే చంపి అవయవాలు విక్రయిస్తామని బెదిరించారని ఆయన తెలిపారు. కిడ్నాప్ సమయంలో, హిమాన్షు సోదరుడు డింపీకి కూడా వీడియో కాల్ చేశారు. మొదట రూ. 1 కోటి డిమాండ్ చేసినప్పటికీ, చివరకు రూ. 20 లక్షలు చెల్లించడంతో ముఠా హిమాన్షును విడుదల చేసింది.
వివరాలు
హిమాన్షు కోలుకున్న తర్వాత వాంగ్మూలం
ఆ 20 లక్షలను బాధిత కుటుంబం జలంధర్లోని మరో వ్యక్తికి ఇచ్చింది. తర్వాత, కిడ్నాపర్లు హిమాన్షు, అమన్లను చాబహార్ విమానాశ్రయం వద్ద వదిలిపెట్టింది. సెప్టెంబర్ 7న వారు ఢిల్లీలో చేరారు. హిమాన్షు ఈ సంఘటన నుంచి ఇప్పటివరకు పూర్తిగా కోలుకోలేకపోతున్నాడని పోలీసులు తెలిపారు. తడు పూర్తిగా కోలుకున్న తర్వాత వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.