Electronic Voting Machines-Election-India: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లను ఎక్కడ తయారు చేస్తారో తెలుసా?
ప్రజాస్వామ్య(Democracy)దేశాల్లో ఎన్నికల(Elections)ప్రక్రియ చాలా కీలకమైనది. అటువంటి ఎన్నికలను బాధ్యతాయుతంగా శాంతియుతంగా పారదర్శకంగా నిర్వహించడం చాలా ప్రధానమైనది. ఇందుకోసం పక్కాగా ప్రణాళికలు తయారుచేసి పక్కగా ఏర్పాట్లు చేయడం ఎన్నికల కమిషన్(Election commission)కు చాలా కీలకం. అప్పట్లో మూజువాణీ ఓట్ల పద్ధతి ఉండేది...అంటే ఎవరికి ఎవరెవరు మద్దతిస్తున్నారో చెప్పేలా చేతులు ఎత్తడం. ఇందులో రహస్య ఓటింగ్ అనే భావనే ఉండదు. ఎవరు ఎవరికి మద్దతిచ్చారనేది బహిరంగ రహస్యం. అందుకే రహస్య ఓటింగ్ ను ప్రవేశపెట్టారు. ఈ రహస్య ఓటింగ్ లో భాగంగా బ్యాలెట్ పేపరు పై అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు ఉండేలా ముద్రిస్తారు. మనకి నచ్చిన అభ్యర్థులకు ఓటు వేసేందుకు సిరా తో కూడిన స్వస్తిక్ గుర్తును కేటాయించిన బాక్స్ లో వేయాలి.
ఈవీఎంలు వచ్చాక కౌంటింగ్ సమయం ఆదా
ఇది బ్యాలెట్ పద్ధతి. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఈ బ్యాలెట్ పేపర్లను బూత్ లు, ఏరియా వారీగా కేటాయించి వాటిని లెక్కిస్తారు. ఇదంతా ఓ ప్రహసనం. ఓట్ల లెక్కింపు ఒక్కోసారి రెండ్రోజులు కూడా పట్టేది. తర్వాతి దశలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ల రాకతో లెక్కింపు ప్రక్రియ పూటన్నరకి వచ్చేసింది. ఇంకోమాటలో చెప్పాలంటే మనుషుల శ్రమను, ఒత్తిడిని తగ్గించడంతో పాటుగా సమయాన్ని కూడా ఆదా చేయగలిగాయి ఈవీఎం (EVM) లు. మరి వీటిని ఎక్కడ తయారు చేస్తారు? ఏ దేశం నుంచి తీసుకొస్తారు? అనేగా మీ సందేహం.. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) (ECIL) 1980లోనే తొలి ప్రోటో టైప్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ను తయారు చేసింది.
తొలిసారి కేరళలో ప్రయోగాత్మకంగా ఈవీఎంలు
ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను ఎక్కడా ఎటువంటి లోపం లేకుండా తయారు చేసే బాధ్యతను ఈసీఐఎల్ తీసుకుని తయారుచేసి చూపించింది. అలా వచ్చిన ఈవీఎం ద్వారా దేశంలోనే తొలిసారిగా 1982 లో కేరళ (Kerala) లో పరవుర్ (Paravuru) నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహించింది. అప్పుడే ఈ మెషీన్ల పనితీరు, నాణ్యతపై దేశంలో పెద్ద చర్చే జరిగింది. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా భిన్న వాదనలు రావడంతో ఈవీఎంలను ఎన్నికల్లో వినియోగించవద్దని సుప్రీంకోర్టు (Supreme Court)ఆదేశించింది. 2004 లో రాజ్యాంగ సవరణ చేసి ఈవీఎంలను ఎన్నికల్లో వినియోగించడం మొదలు పెట్టారు. ఈ ఈవీఎంలను కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ కమిటీ (టెక్) (TEC) తయారు చేస్తుంది.
వీవీ ప్యాట్ ల తయారీ కూడా
ఇందుకోసం ఈ టెక్ రెండు సంస్థల సహకారాన్ని తీసుకుంటుంది. హైదరాబాద్ లోని ఈసీఐఎల్, బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BHEL) లు ఈవీఎంల తయారీలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. వీటితో పాటుగా వీవీప్యాట్ లను కూడా ఈ సంస్థలు తయారు చేస్తున్నాయి. ఈ ఈవీఎంలు గరిష్టంగా రెండు వేల ఓట్ల వరకూ నమోదు చేస్తాయి. వీటికి విద్యుత్ అవసరం లేదు. బ్యాటరీల ద్వారానే పనిచేస్తాయి. ఈవీఎంలో కంట్రోలింగ్ యూనిట్, బ్యాలెటింగ్ యూనిట్ అని రెండు యూనిట్లు ఉంటాయి. బ్యాలెటింగ్ యూనిట్ ను కంపార్ట్ మెంట్ లో ఏర్పాటు చేస్తే...కంట్రలో యూనిట్ పోలింగ్ అధికారి అధీనంలో ఉంటుంది. ఎం 3 మోడల్ ఈవీఎంల తయారీకి ఒక్కో మెషీన్ కు రూ. 17 వేల వరకూ ఖర్చవుతోంది.