
Ladakh: లద్దాఖ్ ప్రజల స్థానికత, రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్లో నివసించే ప్రజల భాష, సంస్కృతి, రాజ్యాంగ హక్కులకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా స్థానికత,రిజర్వేషన్ల అంశాలపై అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
లద్దాఖ్ ప్రజలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు,మొత్తం ఉద్యోగాల్లో 85 శాతం స్థానాలను అక్కడి స్థానికులకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది.
ఇది సాధించేందుకు, 15 ఏళ్లకుపైగా లద్దాఖ్లో నివసిస్తున్న వారు లేదా కనీసం 7 ఏళ్లపాటు అక్కడ విద్యనభ్యసించి 10వ తరగతి లేదా 12వ తరగతి పరీక్షలు రాసిన వారిని "స్థానికులు"గా గుర్తించనున్నట్లు వెల్లడించింది.
ఈ నిర్ణయంతో అక్కడి నిజమైన స్థానికుల హక్కులు పరిరక్షించబడతాయి.
వివరాలు
లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు
అదనంగా, లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు రిజర్వు చేయనున్నారు.
మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యం.
ఇలాంటి చర్యలు తక్షణమే అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
2019లో ఆర్టికల్ 370ను రద్దు చేసి జమ్ముకశ్మీర్ను రెండు భాగాలుగా విడగొట్టిన తరువాత, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, లద్దాఖ్లోని ప్రజలు తమ భాష, సంస్కృతి, రాజ్యాంగ హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు.
ప్రజల ఈ ఆశయాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
వివరాలు
2023లో నిత్యానంద్ రాయ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ
లద్దాఖ్ ప్రజల స్థానికతను నిర్ధారించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని జనవరి 2023లో ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ లద్దాఖ్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థానికుల సమస్యలను పరిశీలించి, తగిన పరిష్కార మార్గాలను సూచించింది.
ఇక పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ కూడా, ఇదే డిమాండ్ల నేపథ్యంలో 2024 అక్టోబర్లో ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం గుర్తుంచుకోవాలి.
ఈ ఉద్యమం, కేంద్రాన్ని చర్యలకు దారితీసిన అంశాల్లో ఒకటిగా చెప్పవచ్చు.