
Investments: రూ.31,617 కోట్లతో రాష్ట్రంలో 32,633 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా రూ.31,617 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 32,633 మందికి ఉద్యోగావకాశాలు కలుగనున్నాయి.
ఆహారశుద్ధి, ఐటీ, ఇంధనం, ఇన్ఫ్రా అండ్ కమ్యూనికేషన్ (ఐ అండ్ సీ) రంగాల్లో మొత్తం 16 కంపెనీలు తమ పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు సమర్పించగా, వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో ఆమోదించారు.
Details
టీసీఎస్ విస్తరణ - విశాఖలో భారీ కేంద్రం
విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రూ.1,370 కోట్లతో ఒక కేంద్రాన్ని స్థాపించనున్నట్లు ప్రకటించగా, ఈ ప్రతిపాదనకు SIPB సమావేశంలో ఆమోదం లభించింది. ఈ కేంద్రం ద్వారా 12,000 మందికి ఉపాధి లభించనుంది.
ప్రముఖ సంస్థల పెట్టుబడులు
ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ : రూ.4,200 కోట్ల పెట్టుబడి
మా మహామాయ ఇండస్ట్రీస్ : రూ.2,063 కోట్ల పెట్టుబడి
ఈ రెండు సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా ఈ సమావేశంలో ఆమోదం లభించింది.
Details
10 నెలల్లోనే 5 సమావేశాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి ఇప్పటివరకు మొత్తం 5 SIPB సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రూ.4,71,379 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం లభించింది.
వీటి ద్వారా మొత్తం 4,17,188 మందికి ఉద్యోగావకాశాలు కలిగే అవకాశం ఉంది.
ఇది గత పాలనతో పోలిస్తే విశేషమైన పురోగతిగా కనిపిస్తోంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం ఐదు SIPB సమావేశాలే నిర్వహించగా, కూటమి ప్రభుత్వం కేవలం 10 నెలల్లోనే అంతే సంఖ్యలో సమావేశాలు నిర్వహించడం గమనార్హం.
Details
ఐటీ కంపెనీలకు భూకేటాయింపుపై లోకేశ్ సూచన
ఈ సమావేశంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతూ, ఐటీ సంస్థలకు నామమాత్రపు ధరలకు భూములు కేటాయించాలని సూచించారు.
తక్కువ ధరలకు భూములు లభిస్తే, రాష్ట్రానికి మరిన్ని ఐటీ కంపెనీలు రావడానికి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి ఈ సూచనపై సానుకూలంగా స్పందించారు. ఐటీ విధానాన్ని సవరించి, దీనికి అనుగుణంగా కొత్త ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
Details
ఉత్పత్తి ప్రారంభ వేళపై స్పష్టత అవసరం: సీఎం
పెట్టుబడులు రాష్ట్రానికి రావడమే కాదు, అవి గల కార్యరూపం దాల్చడం కూడా అంతే అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
పరిశ్రమలు తమ ప్రాజెక్టులను నిర్ణయించిన సమయానికి ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చే సమయంలోనే ఉత్పత్తి ప్రారంభించే తుది తేదీ స్పష్టంగా తీసుకోవాలని సూచించారు.
అనంతరం దశలవారీగా ప్రాజెక్ట్ పురోగతిని పర్యవేక్షిస్తూ, తదుపరి SIPB సమావేశానికి విస్తృత నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించాయో, వాటి ద్వారా ఎంతమంది ఉద్యోగాలు పొందారో తదితర వివరాలతో కూడిన పోర్టల్ను అభివృద్ధి చేయాలని సూచించారు.
ప్రతి సంస్థ ఎవరికెవరికీ ఉద్యోగం కల్పించిందన్న వివరాలు కూడా అందుబాటులో ఉండాలన్నారు.