Page Loader
Indus Waters Treaty: భారతదేశం సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేతతో.. పాకిస్థాన్‌కు జ‌రిగే న‌ష్టం ఏంటి?
సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేతతో.. పాకిస్థాన్‌కు జ‌రిగే న‌ష్టం ఏంటి?

Indus Waters Treaty: భారతదేశం సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేతతో.. పాకిస్థాన్‌కు జ‌రిగే న‌ష్టం ఏంటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 24, 2025
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని పెహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాల్చిచంపిన దారుణ ఘటనపై స్పందించిన భారత ప్రభుత్వం,కఠిన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌తో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) రద్దు చేసినట్టు ప్రకటించింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు ఎలా సమస్యలను కలిగిస్తుందనే చర్చ ప్రారంభమైంది. ఉగ్రవాద చర్యలపై నిరసనగా ఆయుధాల బదులు జల ఒప్పందాన్ని రద్దు చేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. భవిష్యత్తులో నీటి కొరత కారణంగా యుద్ధాలు జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి శతాబ్దాల తరబడి సింధూ పరివాహక ప్రాంతం అనేక నాగరికతలకు జీవనాధారంగా నిలిచింది.

వివరాలు 

పాకిస్థాన్‌ను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టే అవకాశం 

అయితే ఇప్పుడు అణ్వాయుధ సామర్థ్యం కలిగిన రెండు శత్రుదేశాల మధ్య విభేదాలు,ఈ జలాల అంశాన్ని మరో ఉద్వేగభరిత దశకు తీసుకెళ్తున్నాయి. 1960లో భారత-పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన సింధూ జలాల ఒప్పందాన్నిఇకపై పాటించబోమని భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో,దీని ప్రభావం పాకిస్థాన్‌పై ఎలా ఉండబోతోందో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. గత 60 ఏళ్లలో ఈ రెండు దేశాలు అనేకసార్లు యుద్ధాల్లో తలపడినప్పటికీ,ఈ ఒప్పందాన్ని గౌరవించాయి. ఇటీవలి నిర్ణయం రెండు దేశాల మధ్య సంబంధాలను ఏ దిశలోకి నెట్టేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ముఖ్యమైన నీటి వనరులపై ఒప్పందాన్ని రద్దు చేయడం పాకిస్థాన్‌ను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టే అవకాశముంది.

వివరాలు 

రు ఉపనదుల్లో మూడు భారత్‌కు, మిగతా మూడు పాకిస్థాన్‌కు..

ఈ ఒప్పంద రద్దుతో పాకిస్థాన్‌లో నదుల ప్రవాహం, వ్యవసాయం, ప్రజల జీవనం, పాలనాపరమైన నిర్ణయాలు ఎలా ప్రభావితమవుతాయన్నది ఇప్పుడే అంచనా వేయడం కష్టం. భారత్ ఒక్కసారిగా పాకిస్థాన్‌కు నీటి సరఫరాను పూర్తిగా ఆపేసే శక్తి కలిగి ఉందా? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పుడు లభించదు. కానీ పరిస్థితులు క్రమంగా మారుతూ పోతే, రోజువారీ నీటి అవసరాలకు ఆధారపడే లక్షలాది మంది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది. 1960 ఒప్పందం ప్రకారం సింధూ నదికి చెందిన ఆరు ఉపనదుల్లో మూడు భారత్‌కు, మిగతా మూడు పాకిస్థాన్‌కు కేటాయించబడ్డాయి. రావి, బీస్, సట్లజ్ నదులు భారత్‌కు, ఇక ఇండస్, జీలం, చీనాబ్ నదులు పాకిస్థాన్‌కు చెందుతున్నాయి.

వివరాలు 

విస్తృతంగా పాకిస్థాన్‌లో వ్యవసాయం 

ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తే వెంటనే నీటి ప్రవాహం ఆగిపోతుందా అనే సందేహాలు ఉన్నా,వాస్తవంగా అలాంటి పరిణామం వెంటనే జరగదు. పాకిస్థాన్‌కు ఇండస్,జీలం,చీనాబ్ నదుల నీరు అనేది జీవనాడి వంటిది. వ్యవసాయం,పట్టణాల అవసరాలు,విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక రంగాలు ఈ జలాలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల,ఈనీటి సరఫరాలో జాప్యం జరిగినా కూడా పెద్ద సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ నీటికి ప్రత్యామ్నాయ వనరు పాకిస్థాన్‌కు లేదు. పాకిస్థాన్‌లో వ్యవసాయం విస్తృతంగా సాగుతుంది. నీటిపారుదల వ్యవసాయంలో పాక్ ప్రముఖ దేశంగా నిలుస్తుంది. వ్యవసాయం ప్రధానంగా పశ్చిమ నదులైన సింధూ,జీలం,చీనాబ్ జలాలపై ఆధారపడుతుంది. ఈ నదుల ప్రవాహ మార్గాల్లోనే రైతులు తమ పంటలు సాగిస్తారు.దశాబ్దాల క్రితమే అక్కడ కాలువల వ్యవస్థను అభివృద్ధి చేశారు.

వివరాలు 

శీతాకాలంలో నీటి కొరత

అయితే ఒప్పందం రద్దుతో నీటి ప్రవాహంలో మార్పులు వచ్చినా సరే, వ్యవసాయ రంగం తారుమారు అయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకేసారి నీటిని ఆపేయడం సాధ్యం కాదు.కానీ ప్రవాహంలో చిన్న మార్పులు జరిగినా కూడా అనేక సమస్యలు తలెత్తే పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు గోధుమల సాగు సమయంలో నీటి సరఫరా ఆలస్యమైతే రైతులకు నష్టం తప్పదు. ముఖ్యంగా శీతాకాలంలో నీటి కొరత తీవ్రమవుతుందనేది ఖచ్చితంగా చెప్పవచ్చు.పంట దిగుబడి తగ్గి ధరలు పెరగడం వంటి పరిస్థితులు చైన్స్‌లో జరుగుతాయి. ఇప్పటికే సింధూ డెల్టాలో తాజా నీటి ప్రవాహం తక్కువగానే ఉంది. ఇక మరింత నీరు తగ్గితే, మత్స్య పరిశ్రమ కూడా దెబ్బతినే అవకాశముంది.

వివరాలు 

పాకిస్థాన్‌లో జలవిద్యుత్ వినియోగం అధికం

అదనంగా, తక్కువ నీటిని ఎలా విభజించాలన్నది రాజకీయ సమస్యగా మారుతుంది. ఇది పంజాబ్, సింధ్ రాష్ట్రాల మధ్య తీవ్ర విభేదాలకు దారి తీసే అవకాశం ఉంది. పాకిస్థాన్‌లో జలవిద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది.దేశ విద్యుత్తులో మూడో వంతు వరకు హైడ్రోపవర్ ద్వారా లభిస్తుంది. తర్భేలా, మంగ్లా రిజర్వాయర్లకు సరఫరా తగ్గితే విద్యుత్ ఉత్పత్తి మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే పాక్ నీటి కొరతతో ఇబ్బంది పడుతోంది.ఇప్పుడు ఒప్పంద రద్దుతో ఆ పరిస్థితి మరింత కఠినమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇంతకీ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని యుద్ధ ప్రకటనగా భావిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ వ్యాఖ్యానించారు. ఆయన మాటల ప్రకారం,ఈ చర్య పాకిస్థాన్‌పై తీవ్రమైన ఒత్తిడిని తెచ్చిపెడుతుందని స్పష్టమవుతోంది.