Page Loader
TG News: తెలంగాణ అసెంబ్లీ నుంచి భారాస ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ 
తెలంగాణ అసెంబ్లీ నుంచి భారాస ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌

TG News: తెలంగాణ అసెంబ్లీ నుంచి భారాస ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2025
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ నుంచి భారాస ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్‌రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి సీతక్క శాసనసభలో ప్రతిపాదించారు. శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యల అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని సూచించారు. బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ కొనసాగించాలని సభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ప్రతిపాదించగా, స్పీకర్ దానిని ఆమోదించారు. స్పీకర్ వెంటనే జగదీశ్‌రెడ్డి సభను విడిచి వెళ్లాలని ఆదేశించారు.

వివరాలు 

భారాస సభ్యుల నిరసన 

జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌పై భారాస సభ్యులు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జగదీశ్‌రెడ్డి కేసీఆర్ ఛాంబర్‌లో కూర్చుండగా, చీఫ్ మార్షల్ వచ్చి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. అయితే, ''సభ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారు, ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కూర్చుంటే అభ్యంతరమేంటీ?'' అని భారాస ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.

వివరాలు 

ఏం జరిగిందంటే? 

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్, భారాస సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, ''ఈ సభ అందరిదీ, సభ్యులందరికీ సమాన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు,'' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సభా సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయని స్పీకర్ తీవ్రంగా ఆక్షేపించారు.