Parliament Security breach: లోక్సభలో భద్రతా వైఫల్యం.. అదుపులోకి కర్ణాటక మాజీ పోలీసు కుమారుడు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళా లోక్సభ లోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చిన ఘటనలో ఢిల్లీ పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు కర్ణాటకలోని బాగల్కోట్కు చెందిన రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుమారుడు సాయికృష్ణగా గుర్తించారు. డిసెంబరు 13న లోక్సభ ఛాంబర్లోకి ప్రవేశించి డబ్బాల నుండి పసుపు వాయువును విడుదల చేసిన పార్లమెంటు చొరబాటుదారులలో ఒకరైన మనోరంజన్ డి టెక్కీ స్నేహితుడు సాయికృష్ణ అని వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఉగ్రవాద నిరోధక చట్టం,చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితుల్లో మనోరంజన్ కూడా ఉన్నారు. సాయికృష్ణ,మనోరంజన్లు బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బ్యాచ్మేట్స్.
విద్యార్థి జీవితం నుండి షహీద్ భగత్ సింగ్ భావజాలంపై మక్కువ
ఇంటి నుండి పని చేస్తున్న అతన్ని ఢిల్లీ పోలీసులు నిన్న రాత్రి 10 గంటలకు బాగల్కోట్లోని అతని ఇంటి నుండి అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం దేశ రాజధానికి తీసుకొచ్చారు. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న మరో వ్యక్తిని ఉత్తర్ప్రదేశ్ లోని జలౌన్కు చెందిన అతుల్ కులశ్రేష్ఠగా గుర్తించారు. 'బచ్చా' అని కూడా పిలువబడే అతుల్కు గతంలో ఎలాంటి నేర చరిత్రలు లేవని, రాజకీయ అనుబంధం లేదని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే విద్యార్థి జీవితం నుండి షహీద్ భగత్ సింగ్ భావజాలంపై మక్కువ పెంచుకున్నాడు. అతను ఫేస్బుక్లో పార్లమెంట్ చొరబాటుదారులతో రికార్డ్ చాట్ చేస్తూ పట్టుబడ్డాడు. దింతో విచారణ నిమిత్తం అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
భద్రతా ఉల్లంఘనకు సంబంధించి మొత్తం ఆరుగురి అరెస్టు
భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్తో సంబంధం ఉన్న అతుల్ సమావేశాలు నిర్వహించడంతోపాటు రైతుల ఆందోళనలో కూడా పాల్గొనేవాడు. మీడియా సిబ్బంది అతుల్ ఇంటికి చేరుకోగా,కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అతుల్కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల్లో లోక్సభలోకి చొరబడిన మనోరంజన్,సాగర్ శర్మ,పార్లమెంట్ వెలుపల పొగ డబ్బాలు ఉపయోగించిన అమోల్ షిండే,నీలం ఆజాద్లు ఉన్నారు. లలిత్ ఝా..ఈ ఘటన మొత్తానికి సూత్రధారి అని,అతడికి మహేశ్ కుమావత్ సహకరించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మణిపూర్ అశాంతి,నిరుద్యోగం,రైతుల సమస్యలపై దృష్టిని ఆకర్షించడమే తమ లక్ష్యమని చొరబాటుదారులు పోలీసులకు చెప్పారు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.