Page Loader
Rahul Gandhi: బిహార్‌లో గతంలో తాము చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం: రాహుల్ గాంధీ
బిహార్‌లో గతంలో తాము చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం: రాహుల్ గాంధీ

Rahul Gandhi: బిహార్‌లో గతంలో తాము చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం: రాహుల్ గాంధీ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2025
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో గతంలో తాము చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. బిహార్‌ రాష్ట్రంలో తమ కూటమి అధికారంలోకి వస్తే, దళితులు, మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలైన ఈడబ్ల్యూఎస్‌ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో నిర్వహించిన కులగణనను ఆదర్శంగా తీసుకొని, దేశమంతటా కూడా అలాంటి కులగణన అవసరమని ఆయన హితవు పలికారు.

వివరాలు 

 ఆర్జేడీ, వామపక్షాల కలయికతో మహాఘట్‌బంధన్‌ 

సోమవారం పట్నాలో నిర్వహించిన 'సంవిధాన్‌ సురక్షా సమ్మేళన్‌'లో రాహుల్‌ ప్రసంగించారు. "బిహార్‌లో మేము కాంగ్రెస్‌ తరఫున గతంలో తగినంతగా పని చేయలేకపోయాం. ఈ విషయాన్ని అంగీకరిస్తున్న మొదటి వ్యక్తిని నేనే. అయితే ఇప్పుడు మేము ఆ తప్పుల నుంచి నేర్చుకుంటున్నాం. మేము ఆర్జేడీ, వామపక్షాల కలయికతో మహాఘట్‌బంధన్‌ కూటమిగా ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత, అణగారిన వర్గాల సంక్షేమాన్ని ముఖ్యంగా పరిశీలిస్తాం," అని ఆయన తెలిపారు. బిహార్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన మూడింట రెండవ భాగం జిల్లాల కాంగ్రెస్‌ కమిటీలకు వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులే నేతృత్వం వహిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

వివరాలు 

ఎక్స్‌రే తరహాలో కులగణన అవసరం 

రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ, మన శరీరంలో గాయం తీవ్రతను ఎక్స్‌రే ద్వారా ఎలా గుర్తిస్తామో, అటువంటి అవసరమే దేశవ్యాప్తంగా కులగణనకూ ఉందని వివరించారు. అయితే ఈ కులగణనను భాజపా, ఆరెస్సెస్‌ నిరసించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రస్తుతం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని "నకిలీ అడ్డంకి"గా అభివర్ణిస్తూ, తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పరిమితిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మాదిరిగానే దేశవ్యాప్తంగా కులగణన చేస్తే, అభివృద్ధి దిశ మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశాన్ని కేవలం 5% మంది నియంత్రిస్తున్నారని, కార్పొరేట్‌ రంగాన్ని 10-15% మాత్రమే ఆధిపత్యంలో ఉంచుకున్నారని విమర్శించారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన కారణమని ఆరోపించారు.

వివరాలు 

బెగూసరాయ్‌లో యువజన పాదయాత్ర 

బెగూసరాయ్‌లో కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం, యువజన విభాగం సంయుక్తంగా 'వలసలు ఆపండి.. ఉద్యోగాలివ్వండి' అనే నినాదంతో పాదయాత్ర నిర్వహించగా, రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. వేలాదిగా యువతరం ఈ కార్యక్రమంలో పాల్గొనగా, వారిలో చాలామంది భారత్‌ జోడో యాత్ర సందర్భంగా రాహుల్‌ ధరించిన తెలుపు రంగు టీషర్టులు ధరించి హాజరయ్యారు.

వివరాలు 

ట్రంప్‌ చర్యలతో భ్రమలు తొలగిపోయాయ్‌ 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాల కారణంగా ప్రపంచం కొన్ని భ్రమల నుంచి బయటపడిందని, ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోదీ ఎక్కడా కనిపించటం లేదని రాహుల్‌ ఎద్దేవా చేశారు. ట్రంప్‌ చర్యలతో స్టాక్‌మార్కెట్లు కుదేలవుతున్న తరుణంలో ఆయన సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. భారతదేశానికి ప్రయోజనం కలిగించేలా ఉత్పత్తిపై ఆధారపడి, బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడమే ఇప్పుడు ఏకైక మార్గమని తెలిపారు.