
AP Rains: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినట్టు అధికారులు స్పష్టం చేశారు.
కేరళను తాకిన రెండు రోజుల్లోనే ఈ రుతుపవనాలు ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పూర్తిగా రుతుపవనాలు విస్తరించగా, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల వరకు ఇవి వ్యాపించాయి.
రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
వివరాలు
గంటకు గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం,నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
కొన్ని ప్రాంతాల్లో గంటకు గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ గాలుల ప్రభావంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ సూచించారు.
వివరాలు
30వ తేదీ వరకు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరిక
మత్స్యకారులు ఈ నెల 30వ తేదీ వరకు సముద్రంలో వేటకు వెళ్లకూడదని స్పష్టంగా హెచ్చరించారు.
వర్షాల దృష్ట్యా జిల్లాల వారీగా ఈ విధంగా అంచనా వేయబడింది:
మంగళవారం అనంతపురం, కర్నూలు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
బుధవారం అనంతపురం, కర్నూలు, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.