Page Loader
Tahawwur Rana: తహవూర్‌ రాణా పిటిషన్‌ను తిరస్కరించిన అమెరికా సుప్రీంకోర్టు
తహవూర్‌ రాణా పిటిషన్‌ను తిరస్కరించిన అమెరికా సుప్రీంకోర్టు

Tahawwur Rana: తహవూర్‌ రాణా పిటిషన్‌ను తిరస్కరించిన అమెరికా సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2025
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న తహవూర్‌ రాణా (Tahawwur Rana)కి అమెరికా సుప్రీంకోర్టు నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను అక్కడి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పరిణామంతో అతడిని భారత్‌కు అప్పగించే దారులు మరింత సులభమయ్యాయి. తనను తక్షణమే భారత్‌కు అప్పగించకుండా నిలిపివేయాలని కోరుతూ రాణా ఇటీవల యూఎస్ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశాడు. భారత్‌లో తనకు మానసిక, శారీరకంగా హింస ఎదురవుతుందని ఆరోపించాడు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిగిన సందర్భంగా, కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది.

వివరాలు 

అన్ని న్యాయస్థానాల్లో తహవూర్‌ రాణాకు నిరాశే 

తహవూర్‌ రాణా పాకిస్థాన్‌ పౌరుడైన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో అతడు కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని భారత్‌కు అప్పగించాలంటూ భారత ప్రభుత్వం గతకొంతకాలంగా నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ఈ అప్పగింతను అడ్డుకునేందుకు రాణా అమెరికాలోని ఫెడరల్ కోర్టులతో పాటు శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్ కోర్టును కూడా ఆశ్రయించాడు. అయితే, అన్ని న్యాయస్థానాల్లో అతడికి నిరాశే ఎదురైంది. చివరకు, 2023 నవంబర్ 13న ఆయన అమెరికా సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్‌ కూడా తిరస్కరణకు గురయ్యింది.

వివరాలు 

మరికొంతమంది నేరగాళ్ల విషయంలోనూ ఇదే తరహా నిర్ణయం: ట్రంప్ 

ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కూడా ఓ ప్రకటనలో స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా, ట్రంప్ మాట్లాడుతూ - ''26/11 ముంబయి ఉగ్రదాడిలో పాత్ర వహించిన అత్యంత ప్రమాదకరమైన నేరస్తుడిని భారత్‌కు అప్పగిస్తున్నాం. త్వరలో మరికొంతమంది నేరగాళ్ల విషయంలోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకుంటాం,'' అని స్పష్టంచేశారు.

వివరాలు 

రాణా, హెడ్లీపై ఉగ్రవాద, కుట్ర కేసులు నమోదు

ఇదిలాఉండగా.. , ముంబయి దాడులకు ముందు ఆ కుట్రకు మాస్టర్‌మైండ్‌గా భావించే డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ ముంబయిలో రెక్కీ చేశాడు. ఆ సమయంలో అతనికి తహవూర్‌ రాణా సహాయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న సమయంలో హెడ్లీతో రాణా పరిచయం ఏర్పడింది. ముంబయి దాడులకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పనలో రాణా పాత్ర ఉంది. ఈ నేపథ్యంలో రాణా, హెడ్లీపై ఉగ్రవాద, కుట్ర కేసులు నమోదు అయ్యాయి. 26/11 దాడుల జరిగిన ఏడాది తరువాత, షికాగోలో ఎఫ్‌బీఐ అధికారులు రాణాను అరెస్ట్ చేశారు.