పీయూష్ గోయల్పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు.. క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్పై ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును మంగళవారం అందించారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విపక్ష ఎంపీలనుద్ధేశించి దేశ ద్రోహులుగా అభివర్ణించినందుకు మంగళవారం ఇండియా కూటమికి చెందిన ఎంపీలు రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలకు ఉపసంహరించుకొని వెంటనే పీయూష్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఇవాళ మధ్యాహ్నం విపక్షాలను ద్రోహులుగా పీయూష్ గోయల్ వ్యాఖ్యానించినట్టుగా జైరాం రమేష్ పేర్కొన్నారు. పీయూష్ వ్యాఖ్యలపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినట్టుగా ట్విట్టర్ వేదికగా జైరామ్ రమేష్ వెల్లడించారు.
మూడుసార్లు వాయిదా పడ్డ రాజ్యసభ
మణిపూర్ పై తక్షణ చర్చకు మోదీ ప్రభుత్వం నిరాకరిస్తోందని, ప్రతిపక్ష నాయకులపై పీయూష్ గోయ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడానికి కూడా నిరాకరిస్తున్నారని జైరాం రమేష్ ట్విట్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్, సంకీర్ణ పార్టీలు చైనా మీడియాకు మద్దతునిస్తూ, కుట్ర పన్నుతున్నాయని పీయూష్ గోయల్ ఆరోపించారు. కమ్యూనిస్ట్ పార్టీకి, చైనాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధమో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇవాళ ఉదయం నుండి రాజ్యసభ మూడుసార్లు వాయిదా పడింది. సభ్యులను పదే పదే తమ స్థానాల్లో కూర్చోవాలని రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్ కోరారు.