
PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 4న సాయంత్రం 4:30 గంటలకు కేంద్రమంత్రివర్గ సమావేశం జరగనుంది.
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' తర్వాత ప్రధాని మంత్రులతో సమావేశమవడం ఇదే మొదటిసారి.
ప్రస్తుతం ప్రతిపక్షాలు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.
ఇటీవల సింగపూర్ పర్యటనలో ఉన్న భారత్ డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ కూడా ఈ చర్యల సమయంలో కొన్ని ఫైటర్ జెట్ విమానాలను కోల్పోయిందని ఆయన చెప్పారు.
వివరాలు
కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడిన మల్లికార్జున ఖర్గే
మొదట్లో కొన్ని తప్పిదాలు జరిగినప్పటికీ, వాటిని సరిచేసుకుని భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి ప్రవేశించి ప్రత్యర్థిపై మళ్లీ దాడులు జరిపిందని ఆయన స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యల అనంతరం మంత్రులతో సమావేశానికి ప్రధాని పిలుపునివ్వడం విశేషంగా మారింది.
సీడీఎస్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.
ఆపరేషన్ సిందూర్పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని ఆయన విమర్శించారు.
భారత సైన్యం చేసిన శౌర్యాన్ని ప్రధానమంత్రి మోదీ తన రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు.
వివరాలు
విదేశీ నేతల మధ్యవర్తిత్వం లేదు
ఇక మరోవైపు, భారత్ - పాకిస్తాన్ మధ్య ఏర్పడిన తాజా ఉద్రిక్తతల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు మధ్యవర్తిత్వం చేసారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
అయితే ఈ విషయంలో భారత్ పాక్షికంగా స్పందించింది. కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించిన విషయంలో భారత్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయిలోనే చర్చలు జరిగాయని స్పష్టం చేసింది.
ఎటువంటి విదేశీ నేతల మధ్యవర్తిత్వం లేదని భారత ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది.