Shashi Tharoor: చైనా ఎంత కాపాడినా.. టీఆర్ఎఫ్ను వదిలిపెట్టం: శశిథరూర్
ఈ వార్తాకథనం ఏంటి
లష్కరే తయ్యిబా ముసుగు సంస్థగా చురుకుగా ఉన్న'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)'ను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద జాబితాలో చేర్చకుండా చైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా, భారత్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గబోదని అఖిలపక్ష దౌత్య బృందంలో భాగమైన ఎంపీ శశిథరూర్ తేల్చి చెప్పారు.
TRFపై ఆంక్షలు విధించేందుకు తాము ప్రతిసారీ ఐరాస ఆంక్షల కమిటీకి ఈ అంశాన్ని తీసుకెళ్లుతామని ఆయన స్పష్టం చేశారు.
మండలి తీర్మానాలు, అధికారిక ప్రకటనల్లో TRF పేరు స్పష్టంగా చేర్చాలని తాము ప్రయత్నిస్తామని చెప్పారు.
బ్రెజిల్ దౌత్యవేత్త సెల్సో అమోరిమ్తో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భద్రతా మండలిలో వాస్తవికతకు తగిన విధంగా పునరావస్థీకరణ అవసరం ఉందని థరూర్ అభిప్రాయపడ్డారు.
వివరాలు
చైనా అండతో పాక్ తప్పించుకోవడం అన్యాయం: థరూర్
''పాకిస్థాన్ ప్రభుత్వం చైనా మద్దతుతో TRF పేరును భద్రతా మండలిలో చేర్చకుండా తప్పించుకుంది. కనీసం పేరునైనా ప్రస్తావించలేదు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. భారత్ , బ్రెజిల్ భద్రతా మండలిలో సభ్యులుగా ఉండాల్సిన అవసరం ఉంది'' అని థరూర్ పేర్కొన్నారు.
వివరాలు
భారత్-పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వ వ్యాఖ్యలపై స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తాను దోహదం చేశానని చెబుతుండడంపై, థరూర్ స్పందిస్తూ, భారత్కు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు.
''ఒకవేళ పాకిస్థాన్కు ఆ అవసరం ఉండొచ్చు. భారత్ మాత్రం ఏమీ ఘర్షణ కోరడం లేదు. మాకు ఎవరూ వచ్చి యుద్ధం ఆపమని చెప్పాల్సిన అవసరం లేదు'' అని ఆయన అన్నారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ దౌత్యబృందాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యటిస్తూ భారత్ అభిప్రాయాన్ని వివరిస్తున్నాయి.
ఈ సందర్భంగా శశిథరూర్ నేతృత్వంలోని బృందం ప్రస్తుతం బ్రెజిల్లో పర్యటిస్తోంది. రేపు ఈ బృందం అమెరికాకు చేరుకోనుంది.
వివరాలు
కొలరాడో ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన థరూర్
అంతే కాదు, అమెరికాలోని కొలరాడోలో జరిగిన ఘటనపై కూడా థరూర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
బోల్డర్ కౌంటీలో ఆదివారం జరిగిన ఘటనలో, హమాస్ చెరలో ఉన్న బందీలకు సంఘీభావం తెలుపుతున్న యూదులపై ఒక దుండగుడు మండే స్వభావం గల ద్రావణాలు ఉన్న సీసాలను విసిరాడు.
ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడినట్టు సమాచారం.