Amedhi-Smrithi Irani-Rahul Gandhi: అమేథీ లోక్ సభ స్థానంపై సిట్టింగ్ ఎంపీ స్మృతీ ఇరానీ కీలక వ్యాఖ్యలు
అమేథీ(Amethi)లోక్ సభ(Lok Sabha)నియోజకవర్గంపై సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ(Smriti Irani)కీలక వ్యాఖ్యలు చేశారు. అమేథీ లోక్ సభ స్థానంపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) బావ రాబర్ట్ వాద్రా(Rabert Vadra) కన్నేశారని ఇక రాహుల్ గాంధీ ఆ సీటుపై కర్చీఫ్ వేసుకోవాల్సిందేనని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ (Congress) కు కంచుకోట లాంటి అమేథీ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని నిర్ణయించలేదు. అయితే ఈ స్థానంలో రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమేధీ లోక్ సభ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ స్పందించారు. అమేథీలో ఎన్నికలు జరిగేందుకు ఇంకా 27 రోజులు మాత్రమే మిగిలి ఉంది.
వచ్చే నెల 20న అమేథీలో పోలింగ్
కాంగ్రెస్ పార్టీ ఇలా అభ్యర్థిని ప్రకటించకపోవడం ఇలా ఎప్పుడైనా జరిగిందా అని ఆమె ప్రశ్నించారు. అమేథీ స్థానానికి అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనమన్నారు. అమేథీ నుంచి రాబర్ట్ వాద్రా పోటీ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. బస్సు ప్రయాణాలలో సీటు కోసం ఒకప్పుడు కర్చీఫ్లు వేసేవారని, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అమేథీ స్థానంపై కర్చీఫ్ వేసుకోవాలేమో అని ఇరానీ చమత్కరించారు. అమేథీ స్థానంలో వచ్చే నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ బీజేపీ తరఫున రెండోసారి పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ కేరళలోని వాయ్ నాడ్ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఈ నెల 26న పోలింగ్ జరగనుంది.