Page Loader
Sam Pitroda: 'చైనాను శత్రువుగా భావించడం ఆపండి': శామ్ పిట్రోడా మరో వివాదాస్పద వ్యాఖ్య
'చైనాను శత్రువుగా భావించడం ఆపండి': శామ్ పిట్రోడా మరో వివాదాస్పద వ్యాఖ్య

Sam Pitroda: 'చైనాను శత్రువుగా భావించడం ఆపండి': శామ్ పిట్రోడా మరో వివాదాస్పద వ్యాఖ్య

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2025
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో తన పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. తాజాగా, ఆయన పార్టీ వైఖరికి భిన్నంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారతదేశం చైనాను శత్రువుగా చూడకూడదని ఆయన అన్నారు. చైనా నుంచి వచ్చే ముప్పు అనుకోని విధంగా ఉండొచ్చని పేర్కొంటూ, ఆ దేశాన్ని గౌరవించే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా భారత్‌ తన వైఖరిని మార్చుకొని, చైనాను శత్రువుగా చూడటం మానుకోవాలని సూచించారు. చైనాతో భారతదేశం అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి ఇరు దేశాల మధ్య దురభిప్రాయాలను పెంచుతోందని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

వివరాలు 

దేశానికి కొత్త శత్రువులను తయారు చేస్తోంది

"భారతదేశం మొదటి నుంచి చైనా విషయంలో ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తోంది. ఇది దేశానికి కొత్త శత్రువులను తయారు చేస్తోంది. అంతర్జాతీయంగా భారత్‌కు సరైన మద్దతు లభించడం లేదు. కేవలం చైనాకే కాకుండా, ఇతర దేశాల విషయంలో కూడా భారత్ తన విధానాన్ని పునఃసమీక్షించుకోవాలి. చైనా వల్ల నిజంగా ఏ ముప్పు ఉందో నాకు స్పష్టంగా అర్థం కావడం లేదు. అమెరికా తరచూ చైనాను శత్రువుగా చూపిస్తూ, అదే అభిప్రాయాన్ని భారత్‌లోకి బలవంతంగా నింపుతోంది," అని శామ్‌ పిట్రోడా వ్యాఖ్యానించారు.

వివరాలు 

అంతర్జాతీయంగా అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం పెరిగింది: శామ్ 

అభివృద్ధి చెందుతున్న దేశాలు వేగంగా ఎదగాల్సిన అవసరం ఉందని, పేద దేశాలు మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధాప్య జనాభా పెరుగుతుండగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువత అధికంగా ఉన్నారని ఆయన విశ్లేషించారు. ఈ పరిస్థితులను అర్థం చేసుకుని, దేశాలు సమష్టిగా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. అంతర్జాతీయంగా అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం పెరిగిందని, కమ్యూనికేషన్‌ను మెరుగుపరచుకోవడం ద్వారా ప్రపంచ స్థాయిలో మద్దతును పెంచుకోవాలని పేర్కొన్నారు.

వివరాలు 

భారత్-చైనా సరిహద్దు ఘర్షణలు.. అమెరికా మద్దతు

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా, భారత్-చైనా సరిహద్దు ఘర్షణలు పరిష్కరించేందుకు అమెరికా మద్దతు ఇస్తుందని ట్రంప్‌ ప్రకటించారు. అయితే, దీనిపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిశ్రి స్పందిస్తూ, భారత్ తన పొరుగు దేశాలతో ద్వైపాక్షిక చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.