
Tamil Nadu: విద్య నిధులను నిలిపివేసినందుకు.. కేంద్రంపై మరోసారి సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం..
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రం,తమిళనాడు ప్రభుత్వాల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మరోసారి స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రాష్ట్రానికి చెందిన రూ.2,291 కోట్లకుపైగా విద్యా రంగ నిధులను కేంద్రం అక్రమంగా నిలిపివేసిందంటూ తమిళనాడు సర్కార్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
జాతీయ విద్యా విధానం (NEP) 2020, అలాగే ప్రధాన్ మంత్రి శ్రి (PM SHRI) పాఠశాలలు వంటి కేంద్ర పథకాలను రాష్ట్రం తప్పనిసరిగా అమలు చేయాలనే ఒత్తిడి తేవడానికి కేంద్రం ఈ ఆర్థిక నిర్బంధానికి పాల్పడుతోందని తమిళనాడు ఆరోపించింది.
వివరాలు
రూ.2,291.30 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని తమిళనాడు డిమాండ్
ఈ నిధుల నిలుపుదల వ్యవహారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టులో నేరుగా కేసుగా తీసుకెళ్లింది.
ఆర్టికల్ 131 ప్రకారం కేంద్రంతో రాజ్యాంగ హక్కులపై రాష్ట్రానికి ఏదైనా వివాదం తలెత్తినప్పుడు రాష్ట్రం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు కలిగి ఉంటుంది.
ఈ నేపథ్యంలో పాఠశాల విద్యకు ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు మద్దతు ఇచ్చే సమగ్ర శిక్షా పథకం (SSS) కింద మంజూరైన రూ.2,291.30 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని తమిళనాడు సర్కార్ డిమాండ్ చేసింది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం విడుదల చేయాల్సిన 60 శాతం నిధులు మే 1 నాటికీ రాలేదని పిటిషన్లో పేర్కొంది.
వివరాలు
సమగ్ర శిక్షా పథకం దేశవ్యాప్తంగా నాణ్యమైన విద్య
సమగ్ర శిక్షా పథకం దేశవ్యాప్తంగా నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో రూపొందించిన కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకంగా కొనసాగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి అన్ని మార్గదర్శకాలను అమలు చేస్తోంది అని తెలియజేస్తూ, ఫిబ్రవరి 16, 2024న ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (PAB) రాష్ట్ర సర్కార్ సమర్పించిన ప్రణాళికను ఆమోదించిందని తెలిపింది.
అయినప్పటికీ, మే 21, 2025 నాటికి కేంద్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని తమ పిటిషన్లో తమిళనాడు సర్కార్ స్పష్టం చేసింది.