
Teachers: 2009 తర్వాత నియమితులైనవారూ టీచర్లు టెట్ పాస్ తప్పనిసరి.. లేదంటే రిటైర్ తప్పదు: సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) 2009 నుంచి అమల్లోకి వచ్చిన తరువాత నియమించబడిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణులు కావాలి. పదోన్నతులు పొందాలన్నా టెట్ పాస్ అవ్వడం తప్పనిసరి. ఈ విషయంపై తమిళనాడుకు సంబంధించిన కేసులో జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు దేశంలోని అన్ని రాష్ట్రాల ఉపాధ్యాయులపై ప్రభావం చూపనుంది. తెలంగాణలో 2012 డీఎస్సీ నుంచి టెట్ అమలులోకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.10 లక్షల మంది టీచర్లు ఉన్నారు. వీరిలో సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులు వచ్చే రెండేళ్లలోపు టెట్ పాస్ కావాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
వివరాలు
పదోన్నతులు పొందాలని చూస్తే మాత్రం టెట్ పాస్ కావాలి
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, నిర్ణీత గడువు వరకు టెట్ పాస్ కాకపోతే సంబంధిత ఉపాధ్యాయులు ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారిని విధిగా ఉద్యోగం నుండి తొలగించి, వారికి సంబంధించిన ప్రయోజనాలను ఇవ్వాలని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, 2009 తర్వాత నియమించబడి పదవీ విరమణకు ఐదేళ్లలోపు సర్వీస్ మాత్రమే మిగిలి ఉన్నవారికి టెట్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కానీ పదోన్నతులు పొందాలని చూస్తే మాత్రం టెట్ పాస్ కావాలి. అయితే, 2009 తర్వాత పదోన్నతి పొందిన వారు టెట్ పేపర్-2లో ఉత్తీర్ణులు కావాలా? వద్దా? అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.