
Telangana: తెలంగాణకు గుడ్న్యూస్.. రెండు కొత్త విమానాశ్రయాలు.. రెండేళ్లలో పూర్తి.. ఆ ప్రాంతాల్లోనే ఏర్పాటు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణకు త్వరలోనే రెండు కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయి.ఒక విమానాశ్రయం వరంగల్ జిల్లాలోని మామ్నూర్లో,మరొకటి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ రెండు బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల అభివృద్ధి కోసం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఇవి ప్రజల వినియోగానికి అందుబాటులోకి రావడమే లక్ష్యం. ముఖ్యంగా మామ్నూర్ విమానాశ్రయ అభివృద్ధి పనులు త్వరలోనే మొదలుకానున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూసేకరణకు దాదాపు రూ.205 కోట్లను మంజూరు చేసింది.
వివరాలు
ఈ ప్రాజెక్ట్ కోసం 362ఎకరాల వాయుసేన భూమి
పనులు ఈ ఏడాది చివరినాటికే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొదట చిన్న విమానాలకు అనుకూలంగా అభివృద్ధి చేయాలని ఏఏఐ భావించినప్పటికీ,రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు పెద్ద ప్రయాణికుల విమానాలు (A320, B737) కార్గో విమానాల రాకపోకలకు సైతం అనువుగా ఈ ఎయిర్పోర్టులను అభివృద్ధి చేయాలని తుదిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్లో ఏర్పాటు చేయబోయే విమానాశ్రయానికి సంబంధించి భారత వాయుసేన ఇప్పటికే అనుమతి ఇచ్చింది. అక్కడి వద్ద ఉన్న 362ఎకరాల వాయుసేన భూమిని ఈ ప్రాజెక్ట్ కోసం వినియోగించనున్నారు. అవసరమైతే అదనపు భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది.ఈ రెండు విమానాశ్రయాలను 2027 జూన్ నాటికి సిద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా,కేంద్రం స్థానిక పరిస్థితుల దృష్ట్యా 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామని తెలిపిందని సమాచారం.
వివరాలు
సౌకర్యాల కల్పనకు కనీసం రూ.500 కోట్ల పెట్టుబడి
ఇదిలాఉండగా,రామగుండం,నిజామాబాద్ ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ఏడాది మార్చిలో,వరంగల్ మామ్నూర్ విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని ప్రకటించారు. రన్వే,టెర్మినల్ భవనం,అవసరమైన ఇతర సౌకర్యాల కల్పనకు కనీసం రూ.500కోట్లపెట్టుబడి అవసరమని ఆయన వివరించారు. నిర్మాణం ప్రారంభమైన రెండున్నరసంవత్సరాల్లో పనులు పూర్తి చేస్తామని కూడా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో తెలంగాణలో విమాన ప్రయాణ సౌకర్యాలు విస్తరించేందుకు కొత్తఎయిర్పోర్టుల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై పలుమార్లు కేంద్రాన్ని కోరగా,ఇప్పుడు కేంద్రం నుంచి సానుకూల నిర్ణయాలు రావడంతో రెండు కొత్తవిమానాశ్రయాల ప్రాజెక్టులు ముందుకు కదులుతున్నాయి.