
సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారం.. రైల్వే లైన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
సిద్ధిపేట జిల్లా ప్రజల దశాబ్దాల కల నేటికి ఫలించింది. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
సిద్దిపేట ప్రాంత ప్రజల దశాబ్దాల కలల ప్రాజెక్టు అయిన రైలు సర్వీస్ ఎట్టకేలకు ప్రారంభమైంది.
ఈ రైల్వే లైన్ను నిజామాబాద్ నుంచి పర్చువల్గా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో రూ.8వేల కోట్ల అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు.
కేవలం రూ.60తో రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు రైలు ప్రయాణం చేసే సదావకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు వినియోగించుకోనున్నారు.
నిన్నటిదాకా రైలు ఎక్కాలంటే సికింద్రాబాద్, కాజీపేట, కరీంనగర్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇకపై సిద్దిపేటలోనే రైలెక్కి ప్రయాణించవచ్చు.
Details
నాలుగు జిల్లాలో మొత్తం 15 రైల్వే స్టేషన్లు
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట మీదుగా రాజన్న సిరిసిల్లలోని సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి అక్కడి నుంచి కరీంనగర్ జిల్లాలోని వెదిర మీదుగా పెద్దపల్లి-నిజమాబాద్ వెళ్లే మార్గంలో కొత్తపల్లి వద్ద ఈ లైన్ కలుస్తుంది.
ఈ రైల్వేలైన్ నిర్మాణం మెదక్ జిల్లాలో 9.30 కి.మీ., సిద్దిపేట జిల్లాలో 83.40 కి.మీ., రాజన్నసిరిసిల్ల జిల్లాలో 37.80 కిలోమీటర్లు, కరీంనగర్ జిల్లాలో 20.86 కిలోమీటర్లు ఉండనుంది.
ఈ నాలుగు జిల్లాలో మొత్తం 15 రైల్వే స్టేషన్లు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు.
నేడు మనోహరాబాద్-సిద్దిపేట రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేసుకొని మంగళవారం తొలి రైలు పట్టాలెక్కింది.