
Bengaluru stampede: విక్టరీ పరేడ్పై ఆర్బీబీ చేసిన ప్రచారం వల్లే తొక్కిసలాట.. కర్ణాటక ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ జట్టుపై, బీసీసీఐపై తీవ్ర విమర్శలు గుప్పించింది.
విజయోత్సవ ర్యాలీ నిర్వహణకు సంబంధించి వారు ఎలాంటి అధికారిక అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేసింది.
అంతేకాక, ఆర్సీబీ జట్టు సోషల్ మీడియాలో అత్యధికంగా ప్రచారం చేయడం వల్లే ఈ సంఘటన జరిగిందని ప్రభుత్వ వాదన.
ఈ తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు,ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలేతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
వివరాలు
విజయోత్సవ ర్యాలీ నిర్వహణకు ముందుగా ఎలాంటి అనుమతి తీసుకోలేదు
తమ అరెస్టు చట్టవిరుద్ధమని పేర్కొంటూ, వారు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ కేసును బుధవారం హైకోర్టు సింగిల్ బెంచ్ విచారించింది. కర్ణాటక ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి వాదనలు వినిపించారు.
శశికిరణ్ శెట్టి కోర్టుకు తెలియజేస్తూ, ''విజయోత్సవ ర్యాలీ నిర్వహణకు ముందుగా ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కేవలం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ఒక గంట ముందు మాత్రమే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం నుంచి ఓ లేఖ వచ్చింది. అందులో పరేడ్కు అనుమతిని కోరలేదు. పరేడ్ నిర్వహిస్తున్నామని మాత్రమే పేర్కొన్నారు. ఇది చట్టపరంగా సరైన ప్రక్రియ కాదని'' వివరించారు.
వివరాలు
స్టేడియం గేట్ల వద్దకు సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల మధ్య అభిమానులు
అలాగే,''ఆర్సీబీ జట్టు రాత్రి 12 గంటల నుంచే సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా చురుకుగా ప్రచారం ప్రారంభించింది. అభిమానులను టికెట్ల సమాచారం లేకుండా పెద్దసంఖ్యలో రావాలని పిలుపునిచ్చింది. ఫలితంగా సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల మధ్య అభిమానులు స్టేడియం గేట్ల వద్దకు చేరుకున్నారు. ఇది అభిమానుల రక్షణకు ప్రమాదకర పరిస్థితిని కలిగించింది'' అని ప్రభుత్వ న్యాయవాది వివరించారు.
వివరాలు
ఆర్సీబీ,బీసీసీఐ మధ్య ఒప్పందం
ఇంకా, ''ఇది ప్రభుత్వ నిర్వహించిన కార్యక్రమం అన్నట్లు ప్రదర్శించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇది పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్. మైదాన భద్రత,గేట్ల నిర్వహణ, టికెట్ల వ్యవస్థ..అన్ని ఈ అంశాలపై ఆర్సీబీ,బీసీసీఐ మధ్య ఒప్పందం ఉంది. కాబట్టి ఈ ఘటనకు బీసీసీఐ కూడా బాధ్యత వహించాల్సిందే. ఇక ఈవెంట్ నిర్వహణలో సురక్షిత ఏర్పాట్లు పక్కాగా ఉండాల్సిన అవసరం ఉన్నా, అక్కడ బ్యారియర్లు లేకపోవడం,సైనేజీలు లేకపోవడం వంటి నిర్లక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి'' అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ఘటనపై న్యాయస్థాన విచారణ కొనసాగుతోంది.
ఈ తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.