Page Loader
Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు రూ.11,500 కోట్లు! భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం
విశాఖ ఉక్కుకు రూ.11,500 కోట్లు!

Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు రూ.11,500 కోట్లు! భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2025
08:18 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం ఉక్కు కర్మాగారానికి ఆర్థికంగా అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ కర్మాగారానికి పునరుజ్జీవన పథకాన్ని సిద్ధం చేస్తూ రూ. 11,500 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనుంది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. శుక్రవారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి, ఈ ప్యాకేజీని సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

వివరాలు 

నష్టాల నుంచి గట్టెక్కే చర్యలు 

దిల్లీ పర్యటనల సమయంలో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిలతో క్రమం తప్పకుండా చర్చలు జరిపారు. ఏటా 7.3 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం 2022-23లో రూ. 2,858.74 కోట్ల నష్టం, 2023-24లో రూ. 4,848.86 కోట్ల నష్టాన్ని చవిచూసింది. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారమే దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్‌ను కాపాడే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఇటీవల ప్లాంట్‌ను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.

వివరాలు 

సమగ్ర ప్రణాళికకు కేంద్రం సన్నద్ధం 

విశాఖ ఎంపీ శ్రీభరత్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కార్మిక సంఘాల నేతలు ప్లాంట్‌ పునరుజ్జీవనానికి రూ. 18,000 కోట్ల అవసరమని కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ అడ్వాన్స్‌ ఫండ్ కింద రెండు విడతల్లో రూ. 1,650 కోట్ల సాయం అందజేసింది. విశాఖ ఉక్కు కర్మాగారం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అప్పుల భారం, ముడిసరకుల కొరత, కోర్టు కేసులు, ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్. ఈ సమస్యల పరిష్కారంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా ఉండటానికి కేంద్రం సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. పార్లమెంటు స్థాయీ సంఘం ఇచ్చిన సిఫార్సుల ప్రకారం ఈ ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం లభించినట్లు సమాచారం.

వివరాలు 

ప్యాకేజీ విధివిధానాలు

ఈ ప్యాకేజీలో రూ. 10,300 కోట్లను బాండ్ల రిడెంప్షన్ ద్వారా, మిగతా మొత్తాన్ని ఇతర మార్గాల్లో సమకూర్చేలా ప్రణాళిక రూపొందించారు. ప్యాకేజీ పూర్తి వివరాలను త్వరలో కేంద్ర మంత్రి అధికారిక ప్రకటనలో వెల్లడించే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం ఈ ప్యాకేజీపై ప్రకటన చేయాల్సిందిగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ విలేకరుల సమావేశం వాయిదా పడింది. శుక్రవారం ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.