Page Loader
Baglihar Dam: ఈ ప్రాజెక్టు ఎందుకు పాకిస్తాన్‌కు ఆందోళన కలిగిస్తోంది?
ఈ ప్రాజెక్టు ఎందుకు పాకిస్తాన్‌కు ఆందోళన కలిగిస్తోంది?

Baglihar Dam: ఈ ప్రాజెక్టు ఎందుకు పాకిస్తాన్‌కు ఆందోళన కలిగిస్తోంది?

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2025
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ సింధు జల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దీని కారణంగా పాకిస్థాన్ తమకు రావాల్సిన నీరు ని భారత్ తనవైపు మళ్లించుకుంటుందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఉన్న చీనాబ్ నదిపై నిర్మించిన బగ్లిహార్ డ్యామ్ గేట్లు మూసివేసినట్లున్న వీడియోలు, వార్తలు వెలుగులోకి వచ్చాయి. రాయిటర్స్ ప్రకారం, సింధు జల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేసిన తర్వాత బగ్లిహార్ డ్యామ్‌పై భారత్‌ తొలిసారి మళ్లీ నిర్మాణానికి సంబంధించి కొన్ని పనులను ప్రారంభించిందని పేర్కొంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, ఉత్తర కశ్మీర్‌లో జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా డ్యామ్ గేట్లను కూడా ఇదే తరహాలో మూసివేయాలని భారత్ ఆలోచిస్తున్నట్లు వెల్లడించింది.

వివరాలు 

నీటిని ఆపడం కూడా యుద్ధమే..

బగ్లిహార్, కిషన్‌గంగా ప్రాజెక్టులు రెండూ జలవిద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడేవే. ఈ ప్రాజెక్టుల్లో నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని భారత్‌కు ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానిస్తూ, భారత్ పాకిస్తాన్‌ వైపు వచ్చే నీటిని నిలిపితే లేదా దిశ మార్చితే, దాన్ని వారిపై యుద్ధంగా పరిగణిస్తామని హెచ్చరించారు. "యుద్ధం అనేది కేవలం తుపాకులు లేదా బాంబులతో మాత్రమే జరగదని, నీటిని ఆపడం కూడా యుద్ధమే" అని ఆయన అన్నారు. దీని ప్రభావంగా ప్రజలు ఆకలితో, దాహంతో మరణించే పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు.

వివరాలు 

బగ్లిహార్ డ్యామ్ వివాదం ఎలా మొదలైంది? 

1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం,ఇరు దేశాలు నదుల నీటి వినియోగానికి సంబంధించిన హక్కులను పంచుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా నిర్మించిన బగ్లిహార్ డ్యామ్ పై పాకిస్తాన్ చాలాకాలంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. ప్రపంచ బ్యాంకును కూడా ఈ వివాదంలో జోక్యం చేసేందుకు కోరింది. కిషన్‌గంగా డ్యామ్ విషయంలో కూడా పాకిస్తాన్ నిరసనలు తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులు జలవిద్యుత్ ఉత్పత్తికి సంబంధించినవే. బగ్లిహార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు. ఈ ప్రాజెక్ట్ 1992లో ప్రణాళిక దశలోకి వెళ్లగా, 1999లో నిర్మాణం మొదలై, 2008లో పూర్తి అయింది.

వివరాలు 

గేట్లు మూసివేయడానికి కారణం ఏమిటి? 

హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం, బగ్లిహార్ డ్యామ్‌ గేట్లను మూసివేయడమే వల్ల నీటి ప్రవాహం 90 శాతం తగ్గిందని పేర్కొంది. ఈ చర్య రిజర్వాయర్‌లో పేరుకున్న బురదను తొలగించేందుకు తీసుకున్నదని నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. కిషన్‌గంగా డ్యామ్‌లో కూడా ఇదే విధమైన ప్రక్రియ అమలవుతోంది. పేరు చెప్పేందుకు ఇష్టపడని అధికారి ప్రకారం, బురదను తీసిన తరువాత, జలాశయాన్ని నీటితో నింపే ప్రక్రియ శనివారం ప్రారంభమైందని తెలిపారు. ది ట్రిబ్యూన్ కథనం ప్రకారం, ఇది తొలి సారి కాదు. సాధారణంగా ఉత్తర భారతదేశంలో ఆగస్టులో ఈ ప్రక్రియ చేస్తారు. కానీ వర్షాకాలం వల్ల నీటి నిల్వలు ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు ముందుగానే మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

వివరాలు 

పాకిస్తాన్ ఎందుకు భయపడుతోంది? 

సింధు జల ఒప్పందంలో భాగంగా పశ్చిమ నదులలో చీనాబ్ ఒకటి. ఈ ఒప్పందం ప్రకారం,వ్యవసాయం,గృహ వినియోగం,విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని ఉపయోగించేందుకు అనుమతి ఉంది. అయితే 1992 నుంచి పాకిస్తాన్ బగ్లిహార్ డ్యామ్ నిర్మాణంపై అభ్యంతరం తెలియజేస్తూ వస్తోంది. ప్రపంచ బ్యాంకు ద్వారా జరిగిన చర్చల అనంతరం 1999లో నిర్మాణానికి అనుమతి లభించింది. నీటి కొరత ఉన్నప్పుడు పాక్‌కు భారతదేశం నీటిని ఆపేసే అవకాశం ఉంది. అదనంగా నీరు ఉంటేనే పాక్‌కు విడుదల చేస్తుందని ఆందోళన చెందుతోంది. భారత్ అయితే - ఈ భయాలకు ఆధారం లేదని, తాము ఒప్పంద పరంగా ఉన్న హక్కులను మాత్రమే వినియోగిస్తున్నామని చెబుతోంది.

వివరాలు 

భారత్ ప్రస్తుత ప్రణాళికలు ఏమిటి? 

బగ్లిహార్ ప్రాజెక్టుతో బాటు , చీనాబ్ నదిపై మరో నాలుగు ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతోంది. పాకల్ దుల్ (1000 మెగావాట్లు) కిరు (624 మెగావాట్లు) క్వార్ (540 మెగావాట్లు) రాట్లే (850 మెగావాట్లు) ఈ ప్రాజెక్టులను నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC), జమ్మూకశ్మీర్ స్టేట్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాక్ ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా రాట్లే, కిషన్‌గంగా డ్యామ్ డిజైన్‌లు సింధు ఒప్పందానికి విరుద్ధమని ఆరోపిస్తోంది.

వివరాలు 

భారత్ ప్రస్తుత ప్రణాళికలు ఏమిటి? 

హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం: పాకల్ దుల్: 66% పూర్తి కిరు: 55% క్వార్: 19% రాట్లే: 21% పూర్తయ్యాయి. ఈ నాలుగు ప్రాజెక్టులు కలిపి 3,014 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 10,541 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగలవని అంచనా. జమ్మూకశ్మీర్ మొత్తం విద్యుత్ సామర్థ్యం 18,000 మెగావాట్లు కాగా, అందులో 11,823 మెగావాట్లు చీనాబ్ బేసిన్ నుంచే వస్తుంది.