
Ajinkya Rahane: టీమ్లోకి ఇంకొక బౌలర్ను తీసుకోవాలి: అజింక్య రహానే
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్'తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భారత్ 2-1 తేడాతో వెనుకబడింది. మొత్తం ఐదు టెస్టుల సిరీస్లో ఇప్పటికే మూడు మ్యాచ్లు ముగిశాయి.మిగిలిన రెండు మ్యాచ్ల్లో నాలుగో టెస్ట్ జులై 23న మాంచెస్టర్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే జట్టు ఎంపికపై కీలక సూచన చేశాడు. కెప్టెన్ శుభమన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్కు జట్టులో మరో బౌలర్ను చేర్చాలని సలహా ఇచ్చాడు. లార్డ్స్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ ప్రధాన పేసర్లుగా బరిలోకి దిగారు. రవీంద్ర జడేజా,వాషింగ్టన్ సుందర్,నితీశ్ కుమార్రెడ్డి ఆల్రౌండర్లుగా జట్టులో ఉన్నారు. అయితే, వీరితో పాటు నాల్గో టెస్ట్ మ్యాచ్లో ఇంకొక బౌలర్ను జట్టులోకి తీసుకోవాలని రహానే అభిప్రాయపడ్డాడు.
వివరాలు
ఇంగ్లాండ్లో నాలుగో, ఐదో రోజుల్లో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టం
"ఇంగ్లాండ్లో నాలుగో, ఐదో రోజుల్లో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టంగా మారుతోంది. తేలికగా పరుగులు చేయడం సాధ్యపడడం లేదు. ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు. లార్డ్స్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఎక్కువ స్కోరు చేసే అవకాశం టీమ్ఇండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. అందుకే నాల్గో టెస్టులో మరో బౌలర్ను తీసుకోవడం వల్ల టీమ్కు లాభం చేకూరుతుంది. ఎందుకంటే 20 వికెట్లు పడగొట్టగలిగితేనే టెస్ట్ను గెలవడం సాధ్యమవుతుంది. అలాగే సిరీస్ను కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది" అని రహానే తన యూట్యూబ్ ఛానల్లో వ్యాఖ్యానించాడు.