
Afghan women Cricket Team: అఫ్గాన్ మహిళా జట్టుకు భరోసా ఇచ్చిన ఐసీసీ !
ఈ వార్తాకథనం ఏంటి
అఫ్గానిస్థాన్లో తాలిబన్ల పాలన వల్ల ఆ దేశ మహిళా క్రికెట్ జట్టు తీవ్రంగా ప్రభావితమైంది. 2021లో తాలిబన్ ప్రభుత్వం మహిళలు ఇతర క్రీడలతో పాటు క్రికెట్ ఆడడాన్ని నిషేధించింది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండు ప్రధాన టోర్నమెంట్లలో అఫ్గాన్ మహిళా జట్టు పాల్గొనేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఐసీసీ ప్రకటించింది. ''అఫ్గాన్ మహిళా క్రికెటర్లకు ఐసీసీ ఈవెంట్లలో సముచిత అవకాశాలు కల్పిస్తాం.వచ్చే ఏడాది నిర్వహించనున్న ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్తో పాటు టీ20 ప్రపంచకప్లో పాల్గొనాలన్న లక్ష్యంతో దేశవాళీ స్థాయిలోనూ వారికి అవకాశాలు కల్పిస్తాం.వారు మెరుగైన ప్రదర్శన చేయడానికి అనుకూల వాతావరణాన్ని అందిస్తాం'' అని ఐసీసీ స్పష్టం చేసింది.
వివరాలు
ఆ విషయంలో..
అఫ్గాన్ మహిళా క్రికెట్ జట్టుకు మద్దతు ఇస్తామని ప్రకటించినప్పటికీ.. ఆ మద్దతును ఎలా అందిస్తామన్న వివరాలను ఐసీసీ వెల్లడించలేదు. ప్రస్తుతం ఆ జట్టుకు చెందిన మహిళా క్రికెటర్లలో ఎక్కువ మంది ఆస్ట్రేలియాలో నివాసముంటున్నారు. వారిని అంతర్జాతీయ కోచ్లు నిర్వహించే వర్క్షాపులకు ఆహ్వానించడం,ఇతర అంతర్జాతీయ క్రికెటర్లతో ప్రాక్టీస్ మ్యాచ్లు నిర్వహించేందుకు ప్రత్యేక షెడ్యూల్ సిద్ధం చేయడం వంటి చర్యలు చేపట్టే అవకాశముందని భావిస్తున్నారు. కేవలం సాంకేతికంగా కాదు.. నైతికంగా కూడా అఫ్గాన్ మహిళా జట్టుకు మద్దతు ఇవ్వాలని ఐసీసీ యోచిస్తోంది.
వివరాలు
'దేశవాళీ' టోర్నీల్లో అవకాశాలు కల్పించే అంశంపైనా చర్చలు
ఈ నేపథ్యంలోనే ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా ఇప్పటికే బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), క్రికెట్ ఆస్ట్రేలియా లాంటి ప్రముఖ క్రికెట్ బోర్డులతో సంప్రదింపులు జరిపారు. హరారేలో జరిగిన చివరి సమావేశంలోనే అఫ్గాన్ మహిళా క్రికెట్ జట్టుకు మద్దతు ప్రకటించేందుకు వీరు అంగీకరించారని సమాచారం. అంతేకాకుండా.. 'దేశవాళీ' టోర్నీల్లో అవకాశాలు కల్పించే అంశంపైనా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలోని లోకల్ క్రికెట్ జట్లతో మ్యాచ్లు ఆడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.