
ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్.. టాప్-10లోకి రిషభ్ పంత్, బోలాండ్
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి టాప్-10లోకి ప్రవేశించాడు. సిడ్నీ టెస్టులో అద్భుతంగా రాణించిన అతను మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 739 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. సిడ్నీ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 40 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో కేవలం 33 బంతుల్లోనే 61 పరుగులు చేసిన రిషభ్ పంత్ తన స్థాయిని నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ కూడా 29 స్థానాలు ఎగబాకి టాప్-10లోకి చేరాడు. 745 పాయింట్లతో రవీంద్ర జడేజాతో కలిసి 9వ స్థానాన్ని పంచుకున్నాడు. భారత్తో జరిగిన చివరి టెస్టులో బోలాండ్ 10 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
వివరాలు
అత్యుత్తమంగా రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ బుమ్రా
గతవారం ర్యాంకింగ్స్లో 907 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న జస్ప్రీత్ బుమ్రా తాజాగా మరో పాయింట్ను పెంచుకొని టాప్లో కొనసాగుతున్నాడు. భారత్ తరఫున అత్యుత్తమంగా రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ బుమ్రానే. 2016లో అశ్విన్ సాధించిన 904 పాయింట్ల రికార్డును బుమ్రా గతవారం అధిగమించాడు. బ్యాటింగ్ విభాగంలో టాప్-5లో ఎలాంటి మార్పులు లేవు. జో రూట్, హ్యారీ బ్రూక్, కేన్ విలియమ్సన్, యశస్వి జైస్వాల్, ట్రావిస్ హెడ్ వరుసగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా మూడు స్థానాలు మెరుగుపరుచుకొని ఆరో ర్యాంకులో నిలిచాడు. పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ ఐదు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంకును అందుకున్నాడు.
వివరాలు
BGT సిరీస్.. పిచ్ రేటింగ్స్ వచ్చేశాయ్
భారత బ్యాటర్లు శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ మూడేసి స్థానాలు క్షీణించి వరుసగా 23వ, 27వ ర్యాంకులకే పరిమితమయ్యారు. ఆసీస్తో చివరి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ రెండు స్థానాలు పడిపోయి 42వ ర్యాంకులో ఉన్నాడు. ఇటీవల ముగిసిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్లో ఆస్ట్రేలియా 3-1తో విజయం సాధించింది. పెర్త్లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన భారత్ తర్వాత తడబడి సిరీస్ను చేజార్చుకుంది. ఈ ఐదు టెస్టులకు సంబంధించిన పిచ్ రేటింగ్స్ను ఐసీసీ ప్రకటించింది. పెర్త్, అడిలైడ్ ఓవల్, గబ్బా, మెల్బోర్న్ పిచ్లకు 'వెరీ గుడ్' అని, సిడ్నీ పిచ్కు 'సంతృప్తికరం'అని రేటింగ్ ఇచ్చింది. ఇంతకుముందు ఆరు కేటగిరీలుగా ఉన్న పిచ్ రేటింగ్ విధానాన్ని 2023లో నాలుగు కేటగిరీలకు (వెరీ గుడ్,సంతృప్తికరం,అసంతృప్తికరం,అన్ఫిట్)కుదించారు.