
Donald Trump: గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
గాజాలో కొనసాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక చొరవ తీసుకున్నారు. గాజా భూభాగంలో 60 రోజులపాటు కాల్పులు నిలిపివేయాలన్న ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. ఈ తుది ప్రతిపాదనను హమాస్ మిలిటెంట్లు అంగీకరించాలని ఆయన కోరారు. హమాస్ ఈ అవకాశాన్ని వదులుకుంటే, భవిష్యత్లో పరిస్థితులు మరింత భయానకంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని మంగళవారం ట్రంప్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గాజా పరిణామాలపై అమెరికా ప్రతినిధులు ఇజ్రాయెల్ అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపారని చెప్పారు.
వివరాలు
ఖతార్, ఈజిప్ట్ ద్వారా హమాస్కు తుది ప్రతిపాదన పంపిణీ
తుది ప్రతిపాదనను ఖతార్,ఈజిప్ట్ దేశాల సహాయంతో హమాస్కు అందించనున్నట్లు ఆయన తెలిపారు. "మధ్యప్రాచ్య భద్రత, శాంతి కోరే ఎవరికైనా ఇది అద్భుత అవకాశం. హమాస్ ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి అవకాశం మరోసారి రాకపోవచ్చు. లేకపోతే పరిస్థితులు మరింత దిగజారతాయి," అని ట్రంప్ వివరించారు. అంతకుముందు ఫ్లోరిడాలో జర్నలిస్టులతో మాట్లాడిన సందర్భంగా, వచ్చే వారం నాటికి హమాస్-ఇజ్రాయెల్ మధ్య బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వచ్చే సోమవారం ఆయన వైట్హౌస్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం కానున్నారు.
వివరాలు
ఆయుధాలను వదిలే ప్రసక్తే లేదన్న హమాస్
ఈ భేటీలో గాజాలో యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపాల్సిన అవసరాన్ని నెతన్యాహుకు బలంగా వివరించనున్నట్లు తెలిపారు. నెతన్యాహు కూడా అదే దిశగా ఆలోచిస్తున్నారని ట్రంప్ అన్నారు. అయితే మరోవైపు, ఇజ్రాయెల్, హమాస్ తమ తమ స్థానాలపై మిగిలిపోయిన పరిస్థితుల మధ్య చర్చలు నిలకడగా సాగడం లేదు. హమాస్ బందీలను విడుదల చేసే అంశాన్ని యుద్ధానికి పూర్తిస్థాయిలో ముగింపు దిశగా ముందుకు వెళ్లే ఒప్పందంలో భాగంగా మాత్రమే చేస్తామని చెబుతుండగా, హమాస్ను పూర్తిగా నిర్వీర్యం చేసి, వారి ఆయుధాలను తొలగిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో హమాస్ తమ ఆయుధాలను వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది.
వివరాలు
ఇజ్రాయెల్ సైనిక చర్యలో56,000 పాలస్తీనియన్లు మృతి
ఇజ్రాయెల్ వెల్లడించిన లెక్కల ప్రకారం,2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు జరిపిన ఉగ్రదాడిలో సుమారు 1,200 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోగా,మరో 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఈ ఘటనల తర్వాత గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యలో56,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ దాడుల కారణంగా గాజాలో తీవ్ర ఆహార కొరత నెలకొనింది. లక్షలాది మంది ప్రజలు నివాసాలు కోల్పోయారు. ఇదంతా అంతర్జాతీయంగా తీవ్రమైన విమర్శలకు దారితీసింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్పై జాతి నిర్మూలనకు సంబంధించిన ఆరోపణలు వెలువడగా, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో యుద్ధ నేరాల ఆరోపణలు నమోదయ్యాయి. అయితే, ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ పూర్తిగా తోసిపుచ్చుతోంది.