
LeT commander: పాక్లో ప్రత్యక్షమైన పహల్గాం ఉగ్రదాడి మాస్టర్మైండ్ సైఫుల్లా కసూరి
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా భావించబడుతున్న లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి ఇటీవల పాకిస్థాన్లో ఒక ర్యాలీలో ప్రత్యక్షమయ్యాడు.
ఈ ర్యాలీలో పాకిస్తాన్కు చెందిన రాజకీయ నాయకులతో పాటు అనేక మంది వాంటెడ్ ఉగ్రవాదులు కూడా పాల్గొన్నారు.
ఈ సంఘటనపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. పాకిస్తాన్లో జరిగిన అణు పరీక్షల వార్షికోత్సవం సందర్భంగా మర్కాజీ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.
ఈకార్యక్రమంలో పాల్గొన్నసైఫుల్లా కసూరి అక్కడ ప్రసంగించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ, "పహల్గాం దాడిలో నన్నే ప్రధాన మాస్టర్మైండ్గా చెబుతున్నారు. ఇప్పుడు నా పేరు అంతర్జాతీయంగా మార్మోగుతోంది" అని అన్నారు.
కాసేపు ప్రసంగించిన కసూరి భారతదేశంపై వ్యతిరేక నినాదాలు చేశారు.
వివరాలు
భారత్ను లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు
ఈ ర్యాలీలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు, మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన తల్హా సయీద్ కూడా పాల్గొన్నారు.
అతడు కూడా భారత్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.ఈ ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పాకిస్తాన్ రాజకీయ నేతలతో వేదిక పంచుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇది పాక్ ప్రభుత్వ ఉగ్రవాద మద్దతును మరోసారి స్పష్టం చేస్తోంది. గత నెల 22న జమ్ముకశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే.
'మినీ స్విట్జర్లాండ్'గా ప్రసిద్ధి గాంచిన బైసరన్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై, అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు అకస్మాత్తుగా తుపాకులతో కాల్పులు ప్రారంభించారు.
వివరాలు
దాడి వెనుక పాకిస్తాన్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా
మహిళలు, పిల్లలను వదిలి పురుషులపై కఠినంగా కాల్పులు జరిపారు.
ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షుల వాదన.
ఈ దాడి వెనుక పాకిస్తాన్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయింది.
దానికి ప్రధాన సూత్రధారిగా సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ను నిఘా వర్గాలు గుర్తించాయి.
దాడికి సంబంధించి మొత్తం ప్రణాళికను అతడే సిద్ధం చేసినట్లు సమాచారం. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందిన ఖలీద్ను, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అత్యంత ప్రమాదకర ఉగ్రవాదిగా గుర్తించింది.
వివరాలు
ఖలీద్ కు ఐఎస్ఐతో పాటు పాక్ ఆర్మీతోనూ బలమైన సంబంధాలు
ప్రస్తుతం ఖలీద్ ఇస్లామాబాద్ను కేంద్రంగా చేసుకుని ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం.
అతడికి పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో పాటు పాక్ ఆర్మీతోనూ బలమైన సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
అంతేకాకుండా, ఈ దాడికి సంబంధించి పీవోకేకు చెందిన మరో ఇద్దరు వ్యక్తుల హస్తం కూడా ఉన్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. దీనిపై ఇప్పటికే పలు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.