
Musk: నవారోపై 'ఎక్స్' ఫ్యాక్ట్ చెక్.. మస్క్ ఏమన్నారంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
భారత దేశాన్ని బెదిరించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఏ ప్రయత్నాన్ని విడిచిపెట్టడం లేదు. భారతదేశంలోని కొన్ని ప్రత్యేక వర్గాలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టేలా నిరంతరం తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆయన చేస్తున్న ఆరోపణలు అబద్ధమని సోషల్ మీడియా 'ఎక్స్' (X) 'ఫ్యాక్ట్ చెక్' చేసి రుజువు చేసింది. ఈ వ్యవహారంపై తాజాగా ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు.
వివరాలు
నవారో వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఎక్స్ ఫ్యాక్ట్ చెక్
ఎలాన్ మస్క్ ప్రకారం, ఎవరైనా తప్పు చేసినా ఎక్స్ కమ్యూనిటీ నోట్స్ ద్వారా నిజాన్ని ప్రపంచానికి తెలియజేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టంగా పేర్కొన్నారు. అంతే కాకుండా ఎక్స్ మరింతగా వాస్తవ తనిఖీలను వినియోగదారులకు అందజేయడం ద్వారా సోషల్ మీడియా భరోసాని పెంపొందిస్తుందన్నారు. "భారత ప్రభుత్వం విధిస్తున్న సుంకాల వల్ల అమెరికాలో ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి. లాభం కోసమే భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్పై మాస్కో యుద్ధాన్ని మద్దతిస్తోంది"అని పీటర్ నవారో ఎక్స్లో పెట్టిన పోస్టులో పేర్కొన్నారు . ఈ పోస్టుపై ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చేసి,నవారో వ్యాఖ్యలను కొట్టిపారేసింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం ఇంధన భద్రత కోసమేనని స్పష్టం చేసింది.
వివరాలు
భారత్ను ఉద్దేశిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న పీటర్ నవారో,బెసెంట్
అలాగే,భారత్ ఏ విధమైన ఆంక్షలను ఉల్లంఘించలేదని వెల్లడించింది. అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ కూడా రష్యా నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని ప్రస్తావించింది. ఫలితంగా,నవారో వ్యాఖ్యలు కపటమైనవిగా పేర్కొంది.ఈ ఫ్యాక్ట్ చెక్పై పీటర్ నవారో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాన్ మస్క్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఎక్స్ నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ను "చెత్తగా" పేర్కొన్నారు. భారత ఉత్పత్తులపై అమెరికా 50శాతం సుంకాలు విధించింది.ఈ కారణంగా భారత్-అమెరికా సంబంధాలు కొంత మేర దెబ్బతిన్నాయి. కొందరు అమెరికా విశ్లేషకులు ఈ టారిఫ్లను తప్పుపట్టినప్పటికీ ,పీటర్ నవారో,బెసెంట్ వంటి వారు మాత్రం భారత్ను ఉద్దేశిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇటీవల నవారో చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం ఖండించింది.ఆయన మాటలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.