Page Loader
Telegram: గోప్యతపై ప్రశ్నలు.. అమెరికా ప్రభుత్వం చేతిలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ 'టెలిగ్రామ్' డేటా!
అమెరికా ప్రభుత్వం చేతిలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ 'టెలిగ్రామ్' డేటా!

Telegram: గోప్యతపై ప్రశ్నలు.. అమెరికా ప్రభుత్వం చేతిలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ 'టెలిగ్రామ్' డేటా!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం సాంకేతిక యుగంలో సమాచారమే (డేటా) అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారింది. అనేక ప్రైవేటు సంస్థలు, ఏజెన్సీలు ప్రజల డేటాను సేకరించి, తమ అవసరాలకు వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో, గోప్యతకు ప్రాధాన్యతను ఇస్తూ ప్రఖ్యాత మెసేజింగ్‌ యాప్‌ 'టెలిగ్రామ్‌' (Telegram) నుండి కూడా డేటా సేకరణ జరుగుతుందని తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. టెలిగ్రామ్‌ తమ పారదర్శక నివేదిక (Transparency Report)లో అమెరికా ప్రభుత్వం డేటా సేకరణ గురించి వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, 2023లో అమెరికా ప్రభుత్వం 900 రిక్వెస్టుల ద్వారా 2,253 మంది యూజర్ల డేటాను సేకరించింది. మొదటి 9 నెలల్లో మాత్రమే 14 రిక్వెస్టులు రావడంతో 108 మంది వివరాలను ప్రభుత్వానికి అందించినట్లు టెలిగ్రామ్‌ తెలియజేసింది.

వివరాలు 

టెలిగ్రామ్‌ సీఈవో పావెల్‌ దురోవ్‌ ఫ్రాన్స్‌లో అరెస్టు

2024 ఆగస్టులో టెలిగ్రామ్‌ సీఈవో పావెల్‌ దురోవ్‌ ఫ్రాన్స్‌లో అరెస్టుకావడం ఈ పరిణామాలకు కారణమైంది. హవాలా మోసాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, చిన్నారులపై లైంగిక దోపిడీ వంటి ఆరోపణలతో ఫ్రాన్స్‌ అధికారులు అతడిని పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత టెలిగ్రామ్‌ ప్రైవసీ పాలసీలో కొన్ని మార్పులు చేసిందని తెలుస్తోంది. ఇప్పుడు, ప్రభుత్వం నుండి అధికారిక రిక్వెస్ట్‌ వచ్చినప్పుడు, యూజర్ల ఐపీ అడ్రస్‌, ఫోన్‌ నెంబర్‌ వంటి నిర్దిష్ట సమాచారాన్ని అందజేస్తోంది. గతంలో టెలిగ్రామ్‌ పాలసీ ప్రకారం ఈ సమాచారం పంచుకునే అవకాశం లేకపోయినా, ఇప్పుడు ఈ మార్పుల కారణంగా పలువురు యూజర్ల సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

వివరాలు 

ప్రైవసీ పాలసీలో మార్పుల నేపథ్యంలో యూజర్లలో అనేక సందేహాలు

ప్రైవసీ పాలసీలో మార్పుల నేపథ్యంలో యూజర్లలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. తమ వ్యక్తిగత సమాచారంపై ప్రభుత్వం కన్నేసి ఉంచుతోందా? సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలు ఉంచడం సురక్షితమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ మార్పులు భద్రతపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గోప్యతకు ప్రాధాన్యత ఇచ్చే టెలిగ్రామ్‌లాంటి ప్లాట్‌ఫామ్స్‌ కూడా వినియోగదారుల డేటాను సేకరిస్తున్నాయనడానికి ఇది ఉదాహరణగా నిలిచింది. ప్రభుత్వ డిమాండ్లకు అనుగుణంగా ప్రైవేటు సంస్థలు తమ వినియోగదారుల గోప్యతను ఎంత మేరకు కాపాడగలవన్న విషయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డిజిటల్‌ గోప్యతకు ఇది ఒక సవాల్‌గా అభివర్ణించబడుతోంది.