
Donald Trump: వైట్హౌస్ కీలక ప్రకటన.. ఇరాన్పై సైనిక చర్యపై రెండు వారాల్లో ట్రంప్ నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల పరస్పర దాడుల కారణంగా పశ్చిమాసియా ప్రాంతం భగ్గుమంటోంది.
ఈ పరిస్థితుల్లో అమెరికా ఈ యుద్ధంలోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని సాకుగా చూపుతూ ఆ దేశంపై సైనిక చర్య చేపట్టేందుకు అమెరికా ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఈ నేపథ్యంలో, అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ కీలక ప్రకటన విడుదల చేసింది.
రెండు వారాల వ్యవధిలోపే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సైనిక చర్యకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకోనున్నారు అని స్పష్టం చేసింది.
వివరాలు
వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య మాటల యుద్ధం
ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య మాటల యుద్ధం కూడా తీవ్రమవుతోంది.
ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం తీసుకునే అంశంపై మీడియాతో మాట్లాడిన వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ - "ఇరాన్తో త్వరలో సంభాషణలు జరుగుతాయా లేదా అనే అంశాన్ని బట్టి అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు," అని తెలిపారు.
ప్రధానంగా దౌత్యపరమైన మార్గాలకే ట్రంప్ ప్రాధాన్యం ఇస్తారని ఆమె పేర్కొన్నారు.
అయితే, ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం పెరగకుండా నివారించడమే ఆయన మొదటి ప్రాధాన్యతగా పేర్కొన్నారు.
ఇరాన్తో ఒప్పందం అంటే, టెహ్రాన్ యురేనియం అభివృద్ధిని నిలిపేయడం, అణు ఆయుధాల తయారీ సామర్థ్యాన్ని తగ్గించడం అనే లక్ష్యాలపైనే దృష్టి ఉంటుందని లీవిట్ తెలిపారు.
వివరాలు
ట్రంప్ ఎల్లప్పుడూ శాంతియుత పరిష్కారాలపైనే దృష్టి
అధ్యక్షుడు ట్రంప్ ఎల్లప్పుడూ శాంతియుత పరిష్కారాలపైనే దృష్టి పెడతారని,ఆయన శాంతిని స్థాపించేందుకు శక్తిని ఉపయోగించే నాయకుడని ఆమె వివరించారు.
అవసరమైతే తన శక్తిని వినియోగించేందుకు ఆయన వెనుకాడరని,కానీ ముందుగా దౌత్య మార్గానికే ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు.
ఇరాన్పై ప్రత్యక్ష సైనిక దాడి విషయంలో ట్రంప్ మద్దతు ఉన్నప్పటికీ ఇంకా తుది ఆదేశాలు ఇవ్వలేదని పలు వార్తా సంస్థలు వెల్లడించాయి.
వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించిన ప్రకారం,ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపేస్తుందా లేదా అన్నదాని ఆధారంగా తదుపరి చర్యలపై ట్రంప్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
గతంలో ఈ అంశంపై వచ్చిన ప్రశ్నకు స్పందిస్తూ - "నేను దాడికి ఆదేశించవచ్చు.. లేదా ఆదేశించకపోవచ్చు," అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వివరాలు
స్పందించిన రష్యా
వచ్చే వారం ఎంతో కీలకమై ఉంటుందని, పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా తెలిపారు.
ఈ క్రమంలో అమెరికా దాడిపై వార్తలు బయటకు వచ్చిన వెంటనే రష్యా స్పందించింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోవడం ప్రమాదకరమని, ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందంటూ హెచ్చరించింది.
ఇక మరోవైపు, ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్లోని ఓ ఆసుపత్రిపై క్షిపణి దాడులు జరిపింది.
దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. "ఇది తీవ్రమైన చర్య, టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు" అని హెచ్చరించారు.
తాము అణు కేంద్రాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే, ఇరాన్ మాత్రం అమాయకులే లక్ష్యంగా దాడులు చేస్తోందని మండిపడ్డారు.