
Sadhana Broadcast shares fraud: సాధన బ్రాడ్కాస్ట్ షేర్ స్కామ్.. బాలీవుడ్ నటుడు సహా 57 మందిపై సెబీ నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
సుమారు తొమ్మిది నెలల క్రితం టాలీవుడ్ నటుడు ప్రభాస్పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షీకి,అప్పట్లో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియా వేదికగా అతడిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కొనసాగింది.
"కల్కి 2898 ఏ.డీ" సినిమాలో ప్రభాస్ జోకర్లా కనిపిస్తున్నాడంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.
దీనిపై దిల్ రాజు, మంచు విష్ణు, నాని వంటి సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ, అర్షద్ను తీవ్రంగా హెచ్చరించారు.
ఇప్పుడు అర్షద్ వార్షీ మళ్లీ ఓ వివాదాస్పద చర్యతో వార్తల్లో నిలిచాడు.
వివరాలు
ఒక్కొక్కరికి రూ.5 లక్షల జరిమానా
'సాధన బ్రాడ్కాస్ట్' అనే కంపెనీ షేర్లు కొనుగోలు చేయాలని యూట్యూబ్ ఛానళ్ల ద్వారా పెట్టుబడిదారులకు సిఫార్సు చేస్తూ, దారితప్పే వీడియోలు ప్రచారం చేసిన కేసులో అతడు చిక్కుల్లో పడ్డాడు.
ఈ కేసులో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షీ, ఆయన భార్య మరియా గోరెట్టి సహా మొత్తం 57 మందిని భారత స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) 1 నుండి 5 సంవత్సరాల వరకు మార్కెట్ల నుంచి నిషేధించింది.
అర్షద్ వార్షీ, ఆయన భార్య మరియాపై సెబీ తలపెట్టిన చర్యలో ఒక్కొక్కరికి రూ.5 లక్షల జరిమానా విధించింది.
సాధన బ్రాడ్కాస్ట్ కంపెనీ ప్రమోటర్లతో పాటు మొత్తం 57 సంస్థలకు రూ.5 లక్షల నుండి రూ.5 కోట్ల వరకు జరిమానాలను సెబీ విధించింది.
వివరాలు
స్కామ్ వెనుక ప్రధాన కుట్రదారులుగా గౌరవ్ గుప్తా, రాకేష్ కుమార్ గుప్తా, మనీష్ మిశ్రా
మొత్తం కంపెనీపై రూ.58 కోట్ల జరిమానా విధించడమే కాకుండా, దీనిపై 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది.
సెబీ విచారణలో భాగంగా అర్షద్ వార్షీ యూట్యూబ్ ప్రచారం ద్వారా రూ.42 లక్షల లాభం, అతని భార్య మరియా గోరెట్టి రూ.51 లక్షల లాభం పొందారని గుర్తించారు.
ఈ స్కామ్ వెనుక ప్రధాన కుట్రదారులుగా గౌరవ్ గుప్తా, రాకేష్ కుమార్ గుప్తా, మనీష్ మిశ్రాలను సెబీ గుర్తించింది.
ఈ సంస్థలో ఆర్టీఏ డైరెక్టర్గా ఉన్న సుభాష్ అగర్వాల్తో పాటు ప్రమోటర్ల మధ్య మధ్యవర్తులుగా మనీష్ మిశ్రా కూడా వ్యవహరించారని సెబీ తేల్చింది.
వివరాలు
109 పేజీల ఆర్డర్ విడుదల చేసిన సెబీ
అర్షద్ వార్షీతో కలిసి వీరు అందరూ కలిసి ఒక ప్రణాళికాబద్ధమైన మోసపూరిత వ్యూహాన్ని రూపొందించి, ఆమలుచేసారని సెబీ తేల్చింది.
ఈ స్కామ్లో పీయూష్ అగర్వాల్, లోకేష్ షా అనే వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని పేర్కొనగా, జతిన్ షా కూడా ఈ వ్యూహాన్ని అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు సెబీ వివరించింది.
అంతేగాకుండా, ఈ స్కామ్ అమలులో ఇతర సంస్థలు కూడా మోసపూరిత వ్యూహాల అమలుకు తోడ్పడ్డట్లు సెబీ పేర్కొంది.
తక్కువ సమయంలో ఎక్కువ లాభాల కోసం ఇదంతా చేశారని ఆర్డర్లో స్పష్టంగా పేర్కొనబడింది.
ఈ మొత్తం అంశంపై సెబీ 109 పేజీల ఆర్డర్ విడుదల చేసింది.
ఇందులో షేర్ ధరలు ఉద్దేశపూర్వకంగా పెరిగేందుకు భారీ స్థాయిలో వ్యూహం రచించారని వెల్లడైంది.
వివరాలు
సోషల్ మీడియాలో అతడిపై మరోసారి గట్టి విమర్శలు
ఈ స్కామ్లో భాగంగా పెట్టుబడిదారులను మభ్యపెట్టే వీడియోల ప్రచారంలో అర్షద్ వార్షీ, అతడి భార్య భాగస్వాములై పనిచేసినట్లు స్పష్టమవుతోంది.
ధరల మార్పిడిపై వచ్చిన ఫిర్యాదులపై సెబీ విచారణ ప్రారంభించగా, ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
సెబీ 2023 మార్చి 2న మొత్తం 31 సంస్థలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సాధన బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ (SBL)షేర్ల వ్యాపారంపై 2022 మార్చి 8 నుండి నవంబర్ 30 వరకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, ఈ వివాదాస్పద వ్యవహారాన్ని బయటపెట్టింది.
నటుడిగా పెద్దగా అవకాశాలు లేని అర్షద్ వార్షీ, ఇలా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నాడన్న వార్తలతో ప్రభాస్ అభిమానులు మళ్లీ తీవ్రంగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో అతడిపై మరోసారి గట్టి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.