Page Loader
Stock market: ఉద్రిక్తతల ప్రభావం.. సెన్సెక్స్‌ 880 పాయింట్లు పతనం!
ఉద్రిక్తతల ప్రభావం.. సెన్సెక్స్‌ 880 పాయింట్లు పతనం!

Stock market: ఉద్రిక్తతల ప్రభావం.. సెన్సెక్స్‌ 880 పాయింట్లు పతనం!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2025
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్ లను భారీగా ప్రభావితం చేశాయి. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడుల యత్నాలను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టినప్పటికీ, వీటి ప్రభావంతో మార్కెట్లలో పతన ధోరణి కొనసాగింది. ఈ ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవొచ్చన్న ఆందోళనలతో షేర్ల అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. వరుసగా రెండవ రోజూ స్టాక్ సూచీలు క్షీణించాయి. సెన్సెక్స్‌ 800 పాయింట్లకుపైగా నష్టపోయి 80వేల దిగువకు చేరింది. నిఫ్టీ 24 వేల మార్కు సమీపంలో ముగిసింది. విమానయానం, పర్యాటకం, రియల్‌ ఎస్టేట్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడితో తీవ్రంగా నష్టపోయాయి. అయితే, ఈ నేపథ్యంలో రక్షణ రంగ షేర్లకు డిమాండ్ పెరిగింది.

Details

ఇంట్రాడేలో ఇది 8 శాతం పెంపు

డ్రోన్ల తయారీ సంస్థ ఐడియా ఫోర్జ్ షేరు ధర ఏకంగా 18 శాతం పెరిగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ స్థిరంగా ముగియగా, స్మాల్‌క్యాప్‌ సూచీ 0.61 శాతం నష్టంతో ముగిసింది. మార్కెట్‌లో అస్థిరతను సూచించే ఇండియా విక్స్‌ 2.98 శాతం పెరిగి 21.63కి చేరుకుంది. ఇంట్రాడేలో ఇది 8 శాతం దాకా పెరిగింది. సెన్సెక్స్‌ ఉదయం 78,968.34 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై, అదే స్థాయిలో ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 880.34 పాయింట్ల నష్టంతో 79,454.47 వద్ద ముగిసింది. నిఫ్టీ 265 పాయింట్లు కోల్పోయి 24,008.00 వద్ద స్థిరపడింది.

Details

బంగారం 3,329 డాలర్ల వద్ద ట్రేడవుతోంది

రూపాయి మారకం విలువ డాలరుతో పోల్చితే 17 పైసలు బలపడి 85.41 వద్ద ఉంది. సెన్సెక్స్‌ 30 షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నష్టాల్లో ముగియగా, టైటాన్‌, టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 63 డాలర్ల వద్ద కొనసాగగా, బంగారం 3,329 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.